అమరావతి రాజధానిలో ఆధ్యాత్మిక వైభవాన్ని మళ్లీ వెలిగించే కీలక కార్యక్రమానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం భూమిపూజ చేయనున్నారు.
మొత్తం రూ.260 కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం, అమరావతిని తిరుమల తరహాలో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికకు శ్రీకారం చుడుతోంది.
రూ.260 కోట్లతో భారీ విస్తర పనులు
టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ అభివృద్ధి ప్రాజెక్టులో తొలి దశ పనులకు రూ.140 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయాన్ని చుట్టుముట్టే పటిష్ఠమైన ప్రాకారం, ఏడు అంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన, రథ మండపాలు ఉన్నాయి. వీటితో పాటు ఆంజనేయ స్వామి ఆలయం, పవిత్ర పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ లు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇవన్నీ భక్తులకు అత్యాధునిక, సాంప్రదాయ సౌకర్యాలను అందించేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. మొదటి విడత ఆలయ నిర్మాణం పూర్తవడంతో ఇప్పుడు రెండో, మూడో విడతలకు శంకుస్థాపన జరగనుంది.