
రవితేజ సోదరుడు భరత్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం భరత్ అంత్యక్రియలు జరిగిన తీరు తెలుగు సమాజంలోని హృదయమున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు రాకపోవడం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగులో అగ్ర శ్రేణి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మాస్ మహారాజ్ రవితేజ తన సొంత సోదరుడి అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు రాకపోవడానికి ఎలాంటి విబేధాలు కారణం కాదని,, రవితేజ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంచేశాడు. తన సోదరుడు విగత జీవిగా పడి వుండటాన్ని తట్టుకోలేకే తాము రాలేదని, ఎవరి సెంటిమెంటు వాళ్లకి వుంటుందని రవితేజ అన్నారు. తాము హాజరు కానంత మాత్రాన మానవత్వం లేని వాళ్లమంటూ కొందరు మీడియా వాళ్లు ఇష్టం వచ్చినట్లు రాయటం తనను కలచివేసిందన్నారు. అలా రాసేముందు ఆలోచించండి. దయ చేసి ఇంకోసారి అలా చేయకండి అని రవితేజ అన్నారు.
అయినా ఇలాంటి రాతల వల్ల ఎవరి ఇమేజ్ కు ఎలాంటి నష్టం వాటిల్లదని.. కానీ దాని గురించి పదే పదే చర్చించే అవకాశం ఇలాంటి కథనాల వల్ల వస్తోందని రవితేజ అభిప్రాయపడ్డారు. దానివల్ల మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. “మా నాన్న 80 సంవత్సరాలు పైబడి వున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే మేమంతా కుప్పకూలిపోయాం. పత్రికలను నేను తప్పుపట్టట్లేదు. కానీ కొందరు మా బాబాయిని జూనియర్ ఆర్టిస్టును చేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుందన్నారు.
మా తమ్ముడితో మాకు ఎలాంటి అనుబంధం ఉందో మాకు తెలుసు. వాడి లాస్ట్ ఇమేజ్ అలా వుండిపోవాలంతే.. అందుకోసమే బాడీని చూసే సాహసం చేయలేదు. వాడి మృతదేహాన్ని చూసి తట్టుకోలేమనే భావనతోనే అంత్యక్రియలకు రాలేదని రవితేజ స్పష్టంచేశారు.
ఇక భరత్ చనిపోయిన తెల్లారే షూటింగ్ కు హాజజరు కావడంపై కూడా రవితేజపై విమర్శలకు కారణమైంది. అయితే 25 మంది నటీనటుల్ని మళ్లీ ఒక్కచోటికి చేర్చాలంటే ఎంత ఇబ్బందో ఆలోచించాలని..అది ఆలలోచించాను. అందుకే షూటింగ్ లో పాల్గొన్నానని రవితేజ క్లారిటీ ఇచ్చారు.