- పెళ్లి చూపులు సినిమాకు జాతీయ అవార్డు రావటంపై ఎంపీ కవిత హర్షం
- రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న అవార్డులను కవితకు చూపించిన టీమ్
- ఇలాంటి మంచి సినిమాలకు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న కవిత
రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్న పెళ్లిచూపులు సినిమా టీం సభ్యులు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆమె అభినందించారు. 64వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ తెలుగు ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ప్లే- డైలాగ్స్ కేటగిరీల్లో రెండు అవార్డులు వరించాయి పెళ్లిచూపులు సినిమాకు. నిన్న డిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. అందుకున్న అవార్డులను ఎంపి కవితకు చూపించారు.
చిత్రం నిర్మాతలు యాష్ రంగినేని, రాజ్ కందుకూరిలతో పాటు చిత్రం డైరెక్టర్ దాస్యం తరుణ్ భాస్కర్ , హీరో దేవరకొండ విజయ్ తల్లిదండ్రులు మాధవి,వర్ధన్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, అభయ్ బేచిగంటిలు ఎంపి కవితను కలిసిన వారిలో ఉన్నారు. యూకె ఎన్నారై అయిన యాష్ రంగినేనికి పెళ్లిచూపులు తొలి సినిమా. అలాగే తరుణ్ భాస్కర్ కు కూడా మొదటి సినిమా కావడం విశేషం. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. మంచి సినిమాలు తీసేవారికి తెలంగాణ ప్రభుత్వం సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.