ఏపీ అసెంబ్లీ ఘటనపై నారా రోహిత్ నిరసన.. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదంటూ వార్నింగ్‌

By Aithagoni RajuFirst Published Nov 21, 2021, 5:48 PM IST
Highlights

శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై హీరో నారా రోహిత్‌ స్పందించారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని వైసీపీ నేతలను హెచ్చరించారు.

చిత్తూరు: రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణమని నారా రోహిత్(Nara Rohith) అన్నారు. ఆదివారం ఆయన నారా వారిపల్లెలో పూర్వీకుల సమాధుల దగ్గర.. నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా Nara Rohith మాట్లాడుతూ పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదని, క్రమశిక్షణకు నందమూరి కుటుంబం మారుపేరని అన్నారు. మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని నారా రోహిత్ అన్నారు. 

పెద్దమ్మ భువనేశ్వరి సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదన్నారు. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసీపీ నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం మరోమారు ఇటువంటి దారుణానికి ఒడిగడితే  సహించేది లేదని నారా రోహిత్ మరోసారి వైసీపీ నేతలను హెచ్చరించారు. నారా రోహిత్.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామమ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్‌ అనే విషయం తెలిసిందే.

 ఈ శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిపై, ఆయన కుటుంబంపై వైసీపీ నాయకులు చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో అటు నారా కుటుంబం, ఇటు నందమూరి కుటుంబం, వారి అభిమానులు స్పందించారు. జరిగిన దాన్ని ఖండించారు. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్‌ కావద్దని హెచ్చరించారు. ఏం మాట్లాడినా చేతులు ముడుచుకుని చూస్తూ ఊరుకోమని తెలిపారు బాలయ్య. ఇలాంటి ఘటనలు అరాచక పాలనకు నాంది అని ఎన్టీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నారా రోహిత్‌ పై విధంగా స్పందించారు.

నారా రోహిత్‌ రాజకీయాలకు అతీతంగా సినిమాల్లో రాణిస్తున్నారు. ఆయన 2009లో `బాణం` చిత్రంతో హీరోగా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత `సోలో` సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఇందులో అనాథగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ చేత క్లాప్స్ కొట్టించింది. ఆ తర్వాత `సారోచ్చారు`లో కీలక పాత్ర పోషించారు. వీటితోపాటు `ప్రతినిధి`, `రౌడీ ఫెలో`, `అసుర`, `తుంటరి`, `సావిత్రి`, `రాజా చేయి వేస్తే`, `జ్యో అచ్యుతానందా`,`శంకర`, `అపట్లో ఒకడుండేవాడు`, `శమంతకమణి`, `కథలో రాజకుమారి`, `బాలకృష్ణుడు`, `ఆటగాడు`,`వీరభోగ వసంత రాయలు` చిత్రాల్లో నటించారు. 

డిఫరెంట్‌ కథాంశంతో కూడిన సినిమాలు చేయడం నారా రోహిత్‌ స్టయిల్‌. అయితే ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ కాలేకపోయాయి. ఇప్పుడు ఆయన చేతిలో `పండగలా వచ్చాడు`, `అనగనగా దక్షాదిలో`,`శబ్దం`,`మద్రాసి` చిత్రాలు చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్నాయి. నారా రోహిత్‌ వెండితెరకి కనిపించి మూడేళ్లు అవుతుంది. వరుసగా ఆయననటించిన సినిమాలు పరాజయం చెందడమే గ్యాప్‌కి కారణమని చెప్పొచ్చు. ఇకపై కొత్తగా వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. 

also read: NTR: `అదొక అరాచక పాలనకు నాంది`.. ఎన్టీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. ఆ సంస్కృతిని కాల్చేస్తున్నారంటూ ఆవేదన

click me!