నంది అవార్డులు కాదు ఎల్లో అవార్డులన్న జీవి,కత్తిమహేష్ కు వార్నింగ్

First Published Nov 26, 2017, 7:45 PM IST
Highlights
  • ఏపీ సర్కారు నంది అవార్డులపై కొనసాగుతున్న ఆరోపణల పర్వం
  • తాజాగా నంది అవార్డులు ఎల్లో అవార్డులుగా మార్చారన్న నటుడు,దర్శకుడు జీవి
  • పవన్ కళ్యాణ్ ను ఏమన్నా అంటే చూసుకుంటామని జీవీ వార్నింగ్

ఏపీ సర్కారు ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై విమర్శలు ఇంకా వెల్లువెత్తుతునే వున్నాయి. గుణశేఖర్ మొదలు పెట్టిన విమర్శల తర్వాత వరుసగా ఒక్కోరు స్పందిస్తునే వున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ అవార్డులు పంచుకొన్నారని నటుడు పోసాని కృష్ణమురళి కూడా నంది అవార్డు నాకొద్దంటూ తీవ్రంగా విమర్శించారు.

 

తాజాగా మరో నటుడు జీవీ సుధాకర్‌నాయుడు భగ్గుమన్నాడు. ఏపీ ప్రభుత్వం నంది, అవార్డులను, సినిమా పరిశ్రమను ఎల్లో గా మార్చిందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆదివారం ద్రాక్షారామంలో మీడియాతో మాట్లాడుతూ జీవీ సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది.

 

ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు సూచన మేరకే నేను సినిమా పరిశ్రమకు వచ్చాను. చిరంజీవి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అందుకే చిరంజీవిలోని రెండు అక్షరాలను నా పేరుకు దాసరి జత చేశారు. అప్పటి నుంచి నేను జీవీ సుధాకర్ నాయుడిని అయ్యాను అని చెప్పారు. హైదరాబాద్‌లో 100 మంది పేద ముస్లిం పిల్లలను స్నేహితులతో కలసి పదేళ్లుగా చదివిస్తున్నానన్నారు. చేసే సేవాకార్యక్రమాలపే ఏనాడూ ప్రచారం చేసుకోలేదని జీవీ అన్నారు.

 

ఇక మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా అంటే తనకు అభిమానమని.. ఆయన జీవిత చరిత్రను జీవి తెరకెక్కిస్తాడని అన్నారు. త్వరలోనే స్వీయ దర్శకత్వంలో వంగవీటి జీవిత కథను సినిమాగా తీస్తానని జీవీ తెలిపారు. విజయవాడలో ఇటీవల జరిగిన ప్రమాదంపైనా జీవీ స్పందించారు. బోటు యజమాని రాష్ట్ర మంత్రి కావడంవల్లే విషయాన్ని తొక్కేశారని జీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌పైనా జీవీ తీవ్ర విమర్శలు చేశాడు. కత్తి మహేశ్‌ గురించి ప్రస్తావిస్తూ.. కోళ్లు కాకుండా గుడ్లు కొక్కొరోకో అంటున్నాయి. ఈ మధ్య రియాలిటీ షోలో ఎవడో బండోడు పాకీ పనిచేసి వచ్చాడు. ఆ రియాలిటీ షోలో వంటలు చేసి.. మరుగుదొడ్లు కడిగి వచ్చినోడు కూడా పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేస్తున్నాడు.

 

హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత కత్తి మహేశ్ తో మాట్లాడుతా. తేడా సింగ్‌లే కాదు.. తేడా నాయుడులు కూడా ఉంటారు. పవన్ రాజకీయాల్లోకి వస్తాననగానే ప్రతీ ఒక్కడు మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో వస్తున్న వాడి కామెంట్లను పట్టించుకోవద్దు. ఒకసారి కాదు.. మూడు సార్లు చెబుతాను. వినికపోతే వాడి సంగతి చూద్దాం. పవన్ కల్యాణ్ అలాంటి వాళ్లను పట్టించుకోడు అన్నాడు. ఎవ్వడికి భయపడే సమస్యలేదు. సంగతి తేలుద్దాం. మన వెనుక అన్న ఉన్నాడు. ఆయన చూసుకొంటాడు. జై పవన్ కల్యాణ్ అంటూ జీవీ సుధాకర్ నాయుడు తన ప్రసంగాన్ని ముగించాడు.

click me!