కరీం మోరానీ.. బాలీవుడ్ నిర్మాత. చెన్నై ఎక్స్ప్రెస్, దమ్, యోధా చిత్రాలకు నిర్మాతగా, దిల్వాలే, హ్యాపీ న్యూఇయర్, రావణ్, చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. 2జీ స్పెక్ట్రం కేసులో కూడా నిందితుడు. కట్ చేస్తే ఇప్పుడు అరెస్టయ్యాడు. ముంబైలో కాదు. హైదరాబాద్ లో. నేరం. రేప్ కేసు. ఎప్పుడు జరిగింది. ఈ ఘటన 2015లో జరిగింది.
ఓ యువతిని మాయమాటలు చెప్పి వశపరుచుకుని మోసం చేశాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆ యువతి తన పరువు పోయినా ఫరవాలేదు కానీ నీచునికి శిక్ష పడేలా చేయాలనుకుని.. నిర్మాతను రోడ్డుకీడ్చింది. రెండున్నరేళ్ల కింద అంటే జూలై 2015న హైదరాబాద్ లో రామోజీ ఫిలింసిటీలో షారుక్ ఖాన్, కాజోల్ నటించిన దిల్వాలే సినిమా చిత్రీకరణ జరిగింది. ఆ సినిమాకు కరీం మొరానీ సహ నిర్మాత.
ఆ సమయంలో ముంబైకి చెందిన ఓ యువతి సినిమాలో అవకాశం కల్పించాలని కరీం మొరానీని కలిసింది. సరేనని మాయమాటలు చెప్పాడు. షూటింగ్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్కు పిలిపించుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. తిరిగి ముంబై వెళ్లాక కూడా కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపి అత్యాచారం చేశాడు. బాధితురాలి నగ్న చిత్రాలను సెల్ఫోన్లో బంధించి బెదిరించాడు.
రెండున్నరేళ్లు అంతా సాఫీగానే సాగినా....మోసం చేస్తున్నాడని గ్రహించిన సదరు యువతి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు ముంబై పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు తమ పరిధిలోకి రాదని చెప్పడంతో ఆమె ఈ నెల 10న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవతను కలిసింది. సీపీ ఆదేశంతో నిర్మాత కరీం మొరానీపై ఐపీసీ 417, 376, 342, 506, 354 నిర్ఛయ యాక్ట్ కింద హయతనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే సదరు బాధితురాలు ఆ నిర్మాత కూతురుకు స్నేహితురాలట. అవకాశం ఇప్పిస్తాడని పరిచయం పెంచుకున్న మొరానీ కూతురు స్నేహితురాలని కూడా చూడకుండా ఏళ్ల తరబడి అత్యాచారం చేసి హింసించాడు.