మిన్ను విరిగి మీద పడితేనే సైన్యాన్ని పిలవాలి, రైల్వే బ్రిడ్జి కట్టేందుకు కాదు

First Published Nov 3, 2017, 11:17 AM IST
Highlights

దేశంలోనే అత్యంత సంపన్నమయిన బొంబయి మునిసిపల్ కార్పొరేషన్ఒక వంతెన నిర్మాణం పనిని సైన్యానికి అప్పగించాల్సి వచ్చిందని చాలా చర్చ జరుగుతూ ఉంది.

భారతీయ రైల్వేలు దేశంలోఅతిపెద్ద ప్రభుత్వ సంస్థ.  ఇటీవలి దాకా ఈ విభాగానికొక్క దానికే ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే హోదా ఉండింది. జాతీయ క్యాలెండర్ లో దానికి ప్రత్యేకంగా ఒక తేదీ కూడా ఉండింది. అయితే, దేశానికి  ప్రాణధారగా గొప్పగా చెప్పు కునే ఈ సంస్థ ఎంత అధ్వాన్నంగా నడుస్తూ ఉందో గత కొన్ని  దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. అంకిత భావంతో పనిచేసే సిబ్బంది ఎందరో ఈ సంస్థలో పనిచేస్తున్నా, తరచూ ప్రమాదాలు జరగడం, ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడం వల్ల  ఈ మధ్య రైల్వేల గొప్ప గురించి మన అంచనా మార్చుకోవలసి వస్తున్నది. ఈ సంస్థ నిర్వహణ మీద చూపిన ఉదాశీనత వల్ల రైలు ప్రమాదాలే కాదు, ఎల్పిన్ స్టో న్ బ్రిడ్జి కూలిపోవడం వంటిసంఘటలను జరిగాయి. ఎందరో ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.

ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. రైళ్లలో ప్రయాణించేది పేదవాళ్లు,మధ్యతరగతి కుటుంబాల వాళ్లే. దేశంలో వీళ్లజనాభా ఎంతో తెలుసుకాబట్టి, పతనావస్థలో ఉన్న రైల్వే ప్రాథమిక వసతులను, భద్రతా చర్యలను  ప్రప్రథంగా బాగా బాగు చేయాల్సిన అవసరం ఉంది.

ఇలాంటపుడే రైల్వేల ప్రయాణికులకోసం మూడు వంతెనలు నిర్మించే పనిని  సైన్యానికి అప్పగించడం జరగుతుందని ఇద్దరు కేంద్ర క్యాబినెట్ మంత్రులు (రైల్వే, రక్షణ)ఒక ముఖ్యమంత్రి(మహారాష్ట్ర)తో కలసి  ప్రకటించారు.

పైకి చూస్తే ఇది బాగానే కనిపిస్తుంది. ఇస్రోతర్వాత,  దేశంలో సామర్థ్యం, నేర్పు ఇంకా మిగిలిఉన్న సంస్థలలో సైన్యం ఒకటి.  సైన్యం ఉండేది యుద్ధం కేయడానికే అయినా, శాంతికాలంలో దేశానికి ఎదురయ్యే కొన్ని అత్యవసర పరిస్థితులలో ప్రజలమధ్యకు సైన్యం రావాలి. రప్పించాలి. గొడవలు, భూకంపాలు, వరదల వంటి  వైపరీత్యాల (అవి మానవ తప్పిదాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు) వల్ల ఎదురయ్యే ఆపత్సమయాలలో సైన్యం అంకితభావంతో,చాకచక్యంతో సహాయచర్యలు పూర్తి చేస్తుంది. అందువల్ల ముంబయిలో రైల్వే వంతెనాలు నిర్మించేందుకు  సైన్యాన్నిరప్పించడం మీద రభస ఎందుకు?

ఇక్కడొక ప్రాథమిక అంశం గుర్తుంచుకోవాలి. కష్టాల్లో ఉన్న పౌరులకు సహాయం చేసేందుకు సైనిక సేవలు అవసరమే అయినా, యుద్ధావసరాలకు శిక్షణ పొందిన సైనికులను చీటికి మాటికి  పౌరసంబంధ కార్యక్రమాల్లోకి లాగడం మంచిది కాదు. సాధారణంగా రెండు రకాల పరిస్థితులలో సైన్యాన్ని జనం మధ్యకు రప్పించడం జరగుతు ఉంటుంది: ఇందులో ఒకటి అత్యవసర పరిస్థితి ఎదురయినపుడయిడు, రెండోది పాలనా యంత్రాంగం నిధులకొరతలో ఉన్నపుడు లేదా  పరిపాలనా యంత్రాంగం భగ్నమైనపుడు.

అయితే, ఇపుడు జరుగుతున్నదేమిటి? దేశంలోనే ప్రతిష్టాత్మకమయిన, సంపన్నమయిన బొంబయి మహా నగర మునిసిపల్ కార్పొరేషన్ ఒక వంతెన నిర్మాణాన్ని సైన్యానికి అప్పగించాలనుకుంటున్నది. ఈ మునిసిపల్ కార్పొరేషన్  దగ్గిరే కాదు, మహారాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్టమెంటు  దగ్గిర కూడా అపారమయిన వనరులున్నాయి. నిధులున్నాయి,నిపుణులున్నారు.  ఇక రైల్వే విషయానికొస్తే, ఈ శాఖలో 13 లక్షలమంది ఉద్యోగులున్నారు. ఈసంస్థ ఎన్నో ప్రతిష్టాకరమయిన ప్రాజక్టులనుచేపట్టింది. అంటే, ప్రాజక్టులు చేపట్టేందుకు, నిర్వహించేందుకు  ఈ సంస్థకు అన్ని వనరులున్నాయి.

అన్ని వనరులు ఉన్న బిఎంసిగాని, మహారాష్ట్ర పిడబ్ల్యుడి గాని,  చివరకు రైల్వేలు గాని,  ఒకవంతెన నిర్మాణాన్ని సైన్యానికి అప్పగించడంలోని తిరకాసేమిటో  అర్థంకావడం లేదు.

సమస్యలను పరిష్కరించడం కోసం ఉత్సాహం,చొరవతో పరిగెత్తుకుంటూ వచ్చే రైల్వే మంత్రి,  తన శాఖ లేదా బిఎంసి, లేదా పిడబ్ల్యుడి చేయాల్సిన పనిని సైన్యానికి అప్పగించేటపుడు జాగ్రత్తగా మరొక సారి అలోచించాల్సి ఉండింది. ఇపుడేమంది, ఇక వంతెన నిర్మాణాన్ని సైన్యానికి అప్పగించడం వల్ల ఈ మూడు భారీ ప్రభుత్వవిభాగాల చేతకాని తనం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలు పౌరసౌకర్యాల విషయంలో నాణ్యతను అందించలేకపోయినపుడు, ముఖ్యంగా పాదచారుల  వంతెనల (ఫుట్ వోవర్ బ్రిడ్జెస్) నిర్మాణంలో ఇది జరిగినపుడు,నేరమెవరిదో, నేరస్థులెవరో తేల్చేయాలి.

వంతెన కూలిన అల్లరి సద్దుమణిగినంది. ఎల్ఫిన్ స్టోన్ వంతెన కూలిపోవడం వల్ల  ఒక అత్యవసర  పరిస్థితి ఏర్పడిందన్న విషయం అందరికి అవగతమవుతూ ఉంది.  కాంట్రాక్టులను ఖరారు చేయడంలో రైల్వే శాఖ చూపే బ్యురాక్రటిక్ ధోరణి వల్ల ఈ శాఖనుంచి గాని, మహారాష్ట్ర పిడబ్ల్యుడి, బిఎంసి నుంచి గాని ఈ సమస్యకు  తక్షణ పరిష్కార మార్గం కనబడటం లేదు.

ప్రభుత్వం, రైల్వే శాఖ, బిఎంసి ఇలా ఏడ్చాయి కాబట్టి, సైన్యాన్ని రంగంలోకి దించి, సైనిక సామర్థ్యంతో వంతెన నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరమొస్తున్నది. గత్యంతరం లేనపుడు, చివరి యత్నంగా భారత ప్రజలకోసం సైన్నాన్నిపిలుస్తూ రావడం కొత్త కాదు. ఇపుడు ముంబాయిలో మిన్ను విరిగి మీద పడిందనుకోవాలా? అయితే, ‘అన్ని విఫలమయినపుడు, సైన్యమే దిక్కు’ అనేనానుడి నిజమవుతున్నదను కోవాలా?

అసలే బ్యురాక్రసి, సైన్యం మధ్య అసఖ్యత పెరుగుతున్న సమయమిది. ఇలాంటపుడు సైన్యం వచ్చి వంతెన నిర్మించడటమేమిటని సర్వీసులో ఉన్నవా ళ్లతో పాటు, పదవీ విరమణ చేసిన సైనికాధికారులు సైతం  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదుపాజ్ఞలలో పనిచేసే క్రమశిక్షణకు సైన్యం మారు పేరు. ఈ మధ్య ఎన్ డిఎ ప్రభుత్వం అంగీకరించేదాకా ‘ఒక హోదా కు ఒకే పెన్షన్’ అనే డిమాండ్ దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకొనకపోయినా, సైన్యం శాంతం వహిస్తూ వచ్చిన సంగతి మనకు తెలుసు.

రాజకీయావసరంతో కాకుండా,  ప్రభుత్వా విభాగాలు పూర్తిగా విఫలమయ్యాని తేల్చి,  ఇలాంటి ప్రాజక్టులు  సైన్యం చేపట్టాల్సిన అగత్యం వచ్చిందనే విషయాన్ని కొత్త రైల్వే మంత్రి ముందుకు తీసుకురావాలి. అటూవైపు రైల్వే ప్రాజక్టులను చక్కగా చేపట్టి పూర్తిచేసేలా రైల్వేల  సామర్థ్యాన్ని పునురుద్ధరించేందుకు , రైల్వేలను చలనశీలంగా ఉంచడంతో పాటు, భవిష్యత్తులో రైల్వే బ్రిడ్జిలను నేర్పుతో కట్టేలా,  ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్య మిచ్చే  ఒక అంతర్జాతీయ సంస్థగా  తీర్చిదిద్దేందుకు రైల్వేమంత్రి తన శక్తి యుక్తులను కూడదీసుకోవాలి.

 

 (* రచయిత రాజ్యసభలో ఎన్ డిఎ సభ్యుడు)

click me!