జడ్డూ భాయ్ భార్య‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు.. ! ఎమోషనల్ కామెంట్స్ !

By Mahesh RajamoniFirst Published Feb 19, 2024, 2:36 PM IST
Highlights

Ravindra Jadeja: భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య‌ రాజ్‌కోట్ లో జ‌రిగిన‌ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో అద‌ర‌గొట్టాడు. అలాగే, రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ప‌త‌నాన్ని శాసించాడు.
 

Ravindra Jadeja: భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టులో భార‌త్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత‌మైన ఆట‌తో ఇంగ్లాండ్ పై విజ‌యం సాధించింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ గేమ్ షోతో రాజ్ కోట్ లో భార‌త్ మ‌రో భారీ విజ‌యాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ను ఎంపిక చేయడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే చాలా మంది ప్లేయ‌ర్లు అద్భుత‌మైన ఆట‌ను ఆడారు.

భారత్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేసి, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను 122 పరుగులకే ఆలౌట్ చేయ‌డంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజాకు ఈ అవార్డు చాలా రకాలుగా ప్రత్యేకం. సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌లో గాయపడిన జడేజా రెండో టెస్టులో ఆడలేకపోయాడు. రాజ్‌కోట్ టెస్ట్ అతనికి పునరాగమన పరీక్ష.. అలాగే, అది అతని సొంత మైదానం. రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు, రవీంద్ర జడేజా తండ్రి ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. జ‌డేజాతో పాటు అత‌ని భార్య‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. జ‌డేజా భార్య రివాబా రాక తర్వాత, అతని కొడుకుతో వారి సంబంధాలు క్షీణించాయ‌ని తండ్రి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

India vs England : టీమిండియా గెలుపులో ఆరుగురు హీరోలు.. !

ఈ ఇంటర్వ్యూ తర్వాత, జడేజా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లో అలాంటి ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పాడు. ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ, జడేజా ప్రదర్శన ప్రభావితం కాలేదు. అతని సొంత మైదానంలో సెంచ‌రీ కొట్ట‌డంతో పాటు అద్భుత‌మైన బౌలింగ్ తో ఇండియాకు విజ‌యం అందించాడు. రాజ్‌కోట్‌ టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చేసరికి 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి రవీంద్ర జడేజా భార‌త జ‌ట్టును ప‌డిపోకుండా నిల‌బెట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల‌తో ఇంగ్లాండ్ ను దెబ్బ‌తీశాడు. దీంతో ర‌వీంద్ర జ‌డేజాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ల‌భించింది.

బీసీసీఐ విడుద‌ల చేసిన ఒక వీడియోలో రవీంద్ర జడేజా తనకు లభించిన ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గురించి మాట్లాడుతూ.. టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, ఐదు వికెట్లు తీయడం విశేషమని, సొంతగడ్డపై టెస్టు గెలవడం కూడా ప్రత్యేకమ‌ని చెప్పాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును త‌న భార్య రివాబా జ‌డేజాకు అంకితం చేస్తున్న‌ట్టు చెప్పాడు. త‌న కోసం ఆమె మానసికంగా చాలా కష్టపడ్డార‌నీ, న‌మ్మ‌కాన్ని ఇచ్చార‌ని చెప్పాడు. ర‌వీంద్ర జ‌డేజా తొలి ఇన్నింగ్స్ లో సెంచ‌రీ చేయ‌డంతో పాటు రెండు వికెట్లు తీసుకున్నాడు. అలాగే, రెండో ఇన్నింగ్స్‌లో జడేజా 12.4 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

ప్రతి ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు.. య‌శ‌స్వి జైస్వాల్ కామెంట్స్ వైరల్ !

click me!