జట్టును రిస్క్‌లో పెట్టాడా?.. ఆ అవార్డుకు అనర్హుడు.. విరాట్ కోహ్లీపై ఈ కొత్త ర‌చ్చేంటి సామి.. !

By Mahesh RajamoniFirst Published Jul 3, 2024, 10:08 AM IST
Highlights

Virat Kohli's World Cup innings : టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. పవర్‌ప్లేలో రోహిత్ శర్మతో పాటు మూడు కీలక వికెట్లు కోల్పోయింది భారత్. అయితే, విరాట్ కోహ్లి ఓ ఎండ్‌లో అండగా నిలిచి టీమిండియా స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.
 

Virat Kohli : బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో కష్ట సమయంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ కొట్టిన ఈ పరుగుల కారణంగా భారత జట్టు 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాపై 7 ప‌రుగుల తేడాతో గెలిచి టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఛాంపియ‌న్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. పవర్‌ప్లేలో రోహిత్ శర్మతో పాటు రిష‌బ్ పంత్, సూర్య‌కుమార్ యాద‌వ్ ల కీల‌క‌మైన 3 వికెట్లు కోల్పోయింది భార‌త్. ఇలాంటి తీవ్ర ఒత్తిడి స‌మ‌యంలో విరాట్ కోహ్లి ఓ ఎండ్‌లో సౌతాఫ్రికా బౌలింగ్ కు ఎదురు నిలిచాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కారణంగా కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

సంజయ్ మంజ్రేకర్ విచిత్రమైన ఆరోపణలు..

టాపార్డ‌ర్ లోని  కీల‌క‌మైన మూడు వికెట్లు ప‌డిన త‌ర్వాత కోహ్లి మొదట అక్షర్ పటేల్‌తో కలిసి 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కోల్పాడు. ఆ తర్వాత శివమ్ దూబే, ఇతర ఆటగాళ్లతో కలిసి భారత్ స్కోర్ బోర్డును ముందుకు న‌డిపించాడు. అయితే, కోహ్లి ఇన్నింగ్స్ కాస్త నిదానంగా సాగిందనీ, దీంతో భారత్ కష్టాల్లో కూరుకుపోయిందని మాజీ క్రికెటర్, కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ సమయంలోనూ కోహ్లీ స్ట్రైక్ రేట్ హాట్ టాపిక్ కాగా, ఇప్పుడు ఈ విషయాన్ని మళ్లీ లేవనెత్తిన మంజ్రేకర్.. విరాట్ డిఫెన్సివ్ గేమ్ కారణంగా హార్దిక్ పాండ్యా లాంటి ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడే ఆట‌గాళ్ల‌కు ఎక్కువ‌ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని చెప్పారు.

ఈఎస్‌పిఎన్‌క్రిక్‌ఇన్‌ఫో తో మంజ్రేకర్ మాట్లాడుతూ.. "కోహ్లీ ఈ ఇన్నింగ్స్ ఆడటం ద్వారా హార్దిక్ పాండ్యాకు రెండు బంతులు మాత్రమే ఆడే అవకాశం లభించింది. భారత్ బ్యాటింగ్ బాగుందని నేను నమ్ముతున్నాను, కానీ విరాట్ కోహ్లీ ఆడిన నెమ్మ‌ది ఇన్నింగ్స్ భార‌త్ మ‌రింత క‌ష్టాల్లోకి నెట్టివుండ‌వ‌చ్చు. దాదాపు ఓటిమి అంచువ‌ర‌కు వెళ్లాం కానీ చివ‌ర‌కు మ‌న‌ బౌలర్లు అద్భుతాలు చేశారు" అని పేర్కొన్నాడు. అలాగే, "భారత్ ఓడిపోయే స్థితిలోకి జారుకుంది. దక్షిణాఫ్రికా విజయావకాశాలు 90 శాతం చేరాయి కానీ, బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన భారత్‌ను ఓటమి నుండి కాపాడిందని" అన్నాడు. విరాట్ కోహ్లీ జ‌ట్టుకు విలువైన ప‌రుగులు అందించాడు కానీ, తానైతే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బౌలర్‌ను ఎంచుకునేవాడిని, ఎందుకంటే వారే భార‌త్ ను ఓట‌మి నుంచి గ‌ట్టెక్కించార‌ని సంజ‌య్ మంజ్రేక‌ర్ అన్నారు. 

click me!