
గతనెలలో ముగిసిన ఐపీఎల్ వేలంలో భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను ముంబై ఇండియన్స్ జట్టు రూ. 15 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక అదే జట్టులో సారథి రోహిత్ శర్మకు దక్కే మొత్తం రూ. 16 కోట్లు. ఐపీఎల్ లో కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ కు దక్కే మొత్తం రూ. 17 కోట్లు. ఇవి ఐపీఎల్ లో మన క్రికెటర్ల జీతాలు. రెండు నెలల పాటు ఈ లీగ్ లో కష్టపడితే దక్కే సొమ్ము అది. అయినా భారత్ లో అత్యధికంగా సంపాదించే క్రీడాకారులు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది కూడా వీళ్ల పేర్లే.. కానీ ఇప్పట్నుంచి అలా కాదు. రెండు నెలలు కష్టపడాల్సిన పన్లేదు. ఒక్కరోజులోనే నేను రూ. 16 కోట్లకు పైగా సంపాదిస్తానని చూపించాడు ఓ భారత క్రీడాకారుడు. అతడి పేరు అనిర్భన్ లాహిరి.
భారత్ లో ప్రొఫెషనల్ గోల్ఫర్ అయిన అనిర్భన్.. చరిత్ర సృష్టించాడు. ఒక్కరోజులో అత్యధిక సంపాదన పొందిన క్రీడాకారుడిగా ఘనత సాధించాడు. పూణెకు చెందిన అనిర్భన్.. యూఎస్ లోని ఫ్లోరిడాలో జరిగిన పీజీఏ టూర్ లో అతడు రన్నరప్ గా నిలిచాడు.
ఈ టోర్నీకి 20 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గా ప్రకటించారు. అయితే ఇందులో రన్నరప్ గా నిలిచిన అనిర్భన్ కు 2.18 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం.. రూ. 16.7 కోట్లు) అతడికి దక్కాయి. ఈ టోర్నీ విజేత ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ స్మిత్.
నాలుగు రోజుల పాటు ఫ్లోరిడాలో జరిగిన ఈ పోటీలో 34 ఏండ్ల అనిర్భన్.. విజేతగా నిలవగానే భారత్ లో ఒక వారినికి గాను అత్యధిక నగదు పొందిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో అనిర్భన్ భారీగా డబ్బులు సాధించడమే గాక తన ర్యాంకునూ మెరుగుపరుచుకున్నాడు. ఈ టోర్నీకి ముందు 322 వ ర్యాంకులో ఉన్న అతడు.. ప్రస్తుతం 89వ ర్యాంకు (233 స్థానాలు పైకి)కు చేరాడు. దీంతో అతడు టాప్-100లోకి చేరాడు.
ఇదిలాఉండగా.. ఐపీఎల్ లో వేతనాలు ఎక్కువని, ఆటగాళ్లు కోట్లకు కోట్లు పొందుతున్నారని విమర్శలు చేసేవాళ్లు ఇకనుంచి కాస్త ఆలోచిస్తారు. నాలుగు రోజులకే అనిర్భన్ సుమారు రూ. 17 కోట్లు సంపాదించాడంటే అదే సంవత్సరం మొత్తం ఆడితే...?
ఐపీఎల్ 2022 లో అత్యధిక వేతనాలు పొందుతున్న ఆటగాళ్లు :
- కెఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్) : రూ. 17 కోట్లు
- రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్) : రూ. 16 కోట్లు
- రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్): రూ. 16 కోట్లు
- రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్): రూ. 16 కోట్లు
- ఇషాన్ కిషన్ (ముంబై ఇండియన్స్) : రూ. 15.25 కోట్లు