
IPL 2022: ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ (IPL 2022) సంగ్రామానికి మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వాంఖడే వేదికగా మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫిండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో కోల్కతా నైట్రైడర్స్ హోరాహోరీగా తలపడనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది సీజన్ కొన్ని నూతన, ఆసక్తికర ఘటనలు జరుగనున్నాయి.
ప్రధానంగా.. భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనాకు తన టీం చెన్నై సూపర్ కింగ్స్ తో మిగితా ప్రాంచైజీలు హండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కీలకమైన ఆటగాడిని ఈసారి ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గత కొన్ని నెలలుగా..సురేష్ రైనా తన వ్యక్తిగత కారణాలు, మోకాలి శస్త్రచికిత్స కారణంగా మ్యాచ్లకు దూరమయ్యాడు. అటు ఫామ్ కూడా సరిగ్గా లేదని సీఎస్కే యాజమాన్యం సురేష్ రైనాను దూరం పెట్టింది. ఈ కారణంతో సురేష్ రైనాను సీఎస్కేతో పాటు మరే ఇతర జట్టు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో అతని ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. అయితే.. ప్రొఫెషనల్ క్రికెట్కు దూరంగా ఉన్న రైనా .. తాజా ఐపీఎల్లో మాత్రం కొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు. మిస్టర్ ఐపీఎల్ అని ముద్దుగా పిలుచుకునే రైనా ఈసారి కామెంట్రీ చేస్తూ.. తన అభిమానులకు అలరించబోతున్నాడు.
ప్రముఖ మీడియా కథనాల ప్రకారం.. ఐపిఎల్- 2022లో భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రితో పాటు రైనా వ్యాఖ్యాతగా కనిపించనున్నారు. వీరిద్దరూ క్యాష్ రిచ్ లీగ్ 15వ ఎడిషన్ యొక్క హిందీ వ్యాఖ్యాన బృందంలో భాగం అవుతారట. చాలా కాలం తర్వాత శాస్త్రి మళ్లీ కామెంటరీ బాక్స్ లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో రవీశాస్త్రీ.. స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్ కామెంటరీ టీమ్లో సభ్యుడుగా వ్యవహరించారు. కానీ 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత.. అతను భారత ప్రధాన కోచ్గా వ్యవహరించారు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత కోచ్గా అతని పదవీకాలం ముగిసింది. అతని తర్వాత రాహుల్ ద్రవిడ్ టీం ఇండియా ప్రధాన కోచ్గా నియమితులయ్యారు. ఆ తర్వత ఇప్పుడు మరోసారి వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు.
ఈ క్రమంలోనే రవిశాస్త్రి హిందీ వ్యాఖ్యానం కోసం శిక్షణ తీసుకుంటున్నాడట. రవిశాస్త్రి ఒక నిపుణుడి నుండి హిందీ పాఠాలు నేర్చుకుంటున్నట్టు సమాచారం. అతను సీజన్కు ముందు కొన్ని వ్యాఖ్యాన రిహార్సల్స్ కూడా చేస్తున్నాడని తెలిసింది. అతను విభిన్న భాషలో వ్యాఖ్యానించినప్పటికీ, IPL 2022 సమయంలో హిందీ వ్యాఖ్యతగా ఎలా అభిమానులకు రిఫ్రెష్ చేస్తాడో వేచి చూడాలి
ఇక రైనా విషయానికి వస్తే.. ఐపీఎల్ ఆరంభం 2008 నుంచి 2015 వరకూ చెన్నై సూపర్ కింగ్స్( సీఎస్కే) కే సురేశ్ రైనా ప్రతినిథ్యం వహించారు. ఆ తర్వాత 2016, 2017 సీజన్లలో చెన్నై టీమ్పై నిషేధం పడగా.. ఆ రెండేళ్లు గుజరాత్ లయన్స్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించారు. కానీ.. చెన్నై రీఎంట్రీ ఇవ్వగానే.. మళ్లీ జట్టులోకి వచ్చేశాడు. అయితే.. 2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లోనూ మ్యాచ్లు ఆడటం లేదు. దాంతో.. అతని ఫామ్, ఫిట్నెస్పై చెన్నైతో పాటు మిగిలిన ఫ్రాంఛైజీలకీ నమ్మకం పోయింది. రైనా సుదీర్ఘమైన కెరీర్లో తొలిసారి రైనాకి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైతో పాటు ఇతరుల ఇతర ప్రాంచెజీలు రైనాకి మొండిచేయి చూపించాయి
మిస్టర్ ఐపీఎల్ తన ఐపీఎల్ కేరీర్లో ఇప్పటివరకూ 205 మ్యాచ్లాడి 5,528 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న రైనా.. ఒక్క చెన్నై టీమ్ తరఫునే 4,687 పరుగులు చేయడం గమనార్హం. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు గుజరాత్ లయన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గుజరాత్కు రైనా కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పటి వరకూ బ్యాట్ తో అలరించిన రైనా.. ఇక నుంచి కామెంటెటర్ గా ఎలా అలరిస్తాడో.. ప్రేక్షకులను ఎలా ఉర్రుతలూగిస్తాడో వేచి చూడాల్సిందే.