
మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచులో భారత మహిళల జట్టు తడబడింది. టాస్ ఓటి బ్యాటింగ్ కు వచ్చిన మిథాలీ సేన.. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి నిలువలేకపోయింది. టోర్నీలో 3 ఓటములతో క్వార్టర్స్ బెర్త్ కోసం తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్లు.. మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో భారత బ్యాటర్ల ను దెబ్బతీశారు. 36 ఓవర్లే ఆడిన భారత జట్టు... 134 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో ఓపెనర్ స్మృతి మంధాన (58 బంతుల్లో 35) మాత్రమే టాప్ స్కోరర్.. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. 31.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్ యస్తిక భాటియా.. 11 బంతుల్లో 8 పరుగులే చేసి శ్రుభ్షోల్ బౌలింగ్ లో బౌల్డ్ అయింది. ఆమె స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ మరోసారి విఫలమైంది. 5 బంతులు మాత్రమే ఆడిన మిథాలీ.. ఒక్క పరుగు మాత్రమే చేసి శ్రుబ్షోల్ బౌలింగ్ లో డంక్లీ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ వెంటనే దీప్తి శర్మ (0) కూడా రనౌట్ అయింది.
వెంట వెంటనే 3 వికెట్లు పడటంతో భారత్.. 8 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 14) కాసేపు నిలిచినట్టే నిలిచి ఆమె కూడా మిథాలీ, దీప్తిల బాటే పట్టింది. డీన్ బౌలింగ్ లో జోన్స్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఆ వెంటనే వచ్చిన స్నేహ్ రాణా (0) డకౌట్ అయి తీవ్ర నిరాశ పరిచింది.
ఒకవైపు వరుసగా వికెట్లు పడుతన్న ఓపికగా ఆడిన మంధాన కూడా 21.4 ఓవర్లో ఎక్లెస్టోన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయింది. అప్పటికీ భారత స్కోరు 71 పరుగులే. దీంతో భారత్ కనీసం వంద పరుగులైనా చేస్తుందా..? అని అనిపించింది.
అయితే వికెట్ కీపర్ రిచా ఘోష్ (56 బంతుల్లో 33), జులన్ గోస్వామి (26 బంతుల్లో 20) లు కలిసి భారత స్కోరును వంద పరుగులు దాటించారు.కానీ రిచా ఘోష్ రనౌట్ కాగా.. గోస్వామిని కేట్ క్రాస్ ఔట్ చేసింది. దీంతో భారత్.. 36.2 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు బ్యూమౌంట్ (1) న గోస్వామి ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసింది. మరో ఓపెనర్ వియాట్ (1) ను మేఘనా సింగ్ ఔట్ చేసింది. అయితే వీరి స్థానంలో వచ్చిన కెప్టెన్ హెదర్ నైట్ (72 బంతుల్లో 53 నాటౌట్, 8 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ కు తోడు.. సీవర్ (45) కూడా రాణించింది. ఈ ఇరువురూ ఇంగాండ్ ను విజయపథం వైపు నడిపించారు. అయితే సీవర్ ను వస్త్రాకార్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే గైక్వాడ్.. అమి ఎలెన్ జోన్స్ (10) ఔట్ చేసి నాలుగో వికెట్ తీసింది.
అయితే విజయానికి చేరువగా వచ్చిన అనంతరం ఇంగ్లాండ్ కూడా కాస్త తడబడింది. ఒకే ఓవర్లో మేఘనా సింగ్.. సోఫియా డంక్లీ (17) తో పాటు బ్రంట్ (0) ను ఔట్ చేసింది. కానీ ఎక్లెస్టోన్ (5 నాటౌట్) తో కలిసి నైట్ మిగతా లాంఛనం పూర్తి చేసింది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ కు ఇది తొలి విజయం. 4 మ్యాచుల్లో ఆ జట్టు 3 ఓటములు, 1 విజయాన్ని సాధించింది. ఇక భారత జట్టుకు ఇది 4 మ్యాచుల్లో రెండో ఓటమి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మీద ఓడి.. పాకిస్థాన్, వెస్టిండీస్ లపై నెగ్గింది.