
Team India : గురువారం ఉదయం భారత జట్టు స్వదేశానికి తిరిగివచ్చింది. టీ20 ప్రపంచ కప్ 2024 లో ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టు తుఫాను కారణంగా వెస్టిండీస్ లో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు, ఇతర సిబ్బందిని ఇండియాకు తీసుకువచ్చింది. ఐసీసీ ట్రోఫీ గెలిచిన టీమిండియా స్వదేశానికి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్ కు, అభిమానులను ఆనందోత్సాహంలో నింపుతూ భారత జట్టు గురువారం ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టింది. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోపీతో ఢిల్లీలో అడుగుపెట్టిన రోహిత్ సేనకు ఘనంగా స్వాగతం లభించింది.
ఢిల్లీకి చేరుకున్న టీ20 ప్రపంచ కప్ 2024 భారత జట్టు సభ్యులు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు బస చేసిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయానికి వెళ్లారు. ఐటీసీ మౌర్య వద్దకూడా భారత జట్టు ఘనంగా స్వాగతం లభించింది. అక్కడ ఏర్పాటు చేసిన బ్యాండ్, పంజాబీ భాంగ్రాకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు క్రికెటర్లు స్టెప్పులేశారు. అక్కడ కొంత సమయం విరామం తీసుకున్న తర్వాత భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి వారు ప్రధాని నివాసానికి వెళ్లారు. ప్రధాని మోడీని కలిసేటప్పుడు మెన్ ఇన్ బ్లూ ప్రత్యేక జెర్సీని ధరించారు. జెర్సీ ముందు భాగంలో 'ఛాంపియన్స్' అని బోల్డ్ అక్షరాలతో రాసి ఉంది. ప్రధాని మోడీ ఆటగాళ్ల పై ప్రశంసలు కురిపిస్తూ అభినందనలు తెలిపారు.
కాగా, 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన భారత జట్టు ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని 2వ సారి గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు గురువారం ఢిల్లీలో తమ అభిమాన హీరోల కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. భారత స్క్వాడ్ సభ్యులు, సహాయక సిబ్బంది, వారి కుటుంబాలు, పలువురు భారత జర్నలిస్టులు తుఫాను కారణంగా బార్బడోస్లో చిక్కుకున్నారు. దీంతో టీమిండియా భారత్ కు రావడం ఆలస్యం అయింది. బెరిల్ తుఫాను కారణంగా బ్రిడ్జ్టౌన్లోని గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం మూడు రోజుల పాటు మూసివేశారు. ఈ క్రమంలోనే బీసీసీఐ టీమిండియా కోసం ప్రత్యేక విమానం పంపింది. దీంతో గురువారం ఉదయం భారత ఆటగాళ్లు ఢిల్లీకి వచ్చారు.