
సీమ్ పిచ్ లపై చెలరేగే టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్.. దక్షిణాఫ్రికా పై సూపర్ బౌలింగ్ చేస్తున్నాడు. నిన్న జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆటలో సిరాజ్ నిప్పులు చెరిగాడు. బుధవారం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 15.1 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. డికాక్ ఇచ్చిన క్యాచ్ ను రాహుల్ పట్టిఉంటే అతడికి రెండు వికెట్లు దక్కి ఉండేవి. కాగా.. వికెట్ తీసిన తర్వాత సిరాజ్ సెలబ్రేషన్స్ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈసారి అతడు ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోను కాపీ కొట్టాడు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో ఆ జట్టు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన డసెన్ ను సిరాజ్ ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ 12.5 ఓవర్లో సిరాజ్ బౌలింగ్ లో అతడు.. అజింక్యా రహానే కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సిరాజ్.. రొనాల్డో మాదిరిగా సంబురాలు జరుపుకున్నాడు. గోల్ కొట్టిన తర్వాత రొనాల్డో.. పిడికిలి బిగించి కుడి చేతిని భూమివైపునకు బలంగా లాగుతాడు.
ఈ స్టైల్ ను ఫుట్బాల్ లో ‘సియువు’ (Siuuu) సెలబ్రేషన్స్ అంటారు. ఇప్పుడు సిరాజ్ కూడా డసెన్ ను ఔట్ చేసిన తర్వాత ఇదే రీతిలో సంబురాలు చేసుకున్నాడు. కాగా, వికెట్ తీసిన తర్వాత వినూత్న రీతిలో సంబురాలు జరుపుకోవడం సిరాజ్ కు ఇదేం కొత్త కాదు. గతంలో ఇంగ్లాండ్ తో సిరీస్ సందర్భంగా కూడా అతడి సెలబ్రేషన్ స్టైల్ చర్చనీయాంశమైంది.
ఇంగ్లాండ్ సిరీస్ లో వికెట్ తీసిన తర్వాత అతడు ముక్కు మీద చేతిని ఉంచి సంబురాలు చేసుకున్నాడు. అయితే దీనికి అర్థం చెబుతూ.. ‘నన్ను విమర్శించేవాళ్లకు నేనిచ్చే సమాధానం..’అని సిరాజ్ చెప్పాడు. ఇక తాజాగా రొనాల్డో స్టైల్ లో సిరాజ్ సంబురాలు చేసుకుంటుండటం విశేషం.
ఇదిలాఉండగా.. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు తొలి సెషన్ లో భారత బ్యాటర్లు పేకమేడను తలపిస్తూ వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. 272-3తో మూడో రోజు ఆట ఆరంభించిన భారత్.. 327 పరుగులకే ఆలౌట్ అయింది. లుంగి ఎంగిడి ఆరు వికెట్లు తీయగా, రబాడా 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మన పేస్ దళం దూకుడుకు సఫారీలు 197 కే ఆలౌట్ అయ్యారు. బవుమా (52) ఒక్కడే భారత బౌలర్లను ప్రతిఘటించి నిలిచాడు. మహ్మద్ షమీ 5 వికెట్లు తీయగా.. బుమ్రా, ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టారు. భారత్ ప్రస్తుతం 146 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులోనాలుగో రోజు తొలి సెషన్ ఆట కీలకంగా మారనున్నది.