Bhuvneshwar Kumar: డాడీస్ ఆర్మీలో చేరిన భువనేశ్వర్.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నుపుర్

By team teluguFirst Published Nov 24, 2021, 5:21 PM IST
Highlights

Bhuvneshwar Kumar: భారత జట్టులోని ప్రధాన పేసర్ భువనేశ్వర్ తండ్రి అయ్యాడు. అతడి భార్య నుపుర్ నగర్.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో ఆనందాలు వెళ్లివిరిశాయి. భారత క్రికెట్ జట్టులోని పలువురు క్రికెటర్ల మాదిరే భువీ కూడా డాడీస్ ఆర్మీలో చేరాడు. అతడి భార్య నుపుర్ నగర్.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిండు గర్భిణీగా ఉన్న నుపుర్ కు మంగళవారం నొప్పులు రావడంతో ఆమెను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ దవాఖానాలో చేర్పించారు. ఆమెతో ప్రస్తుతం భువీ తల్లి, చెల్లెలు ఉన్నారు. 

తండ్రి అయిన విషయాన్ని భువీకి వాళ్ల కుటుంబసభ్యులు ఫోన్ లో తెలియజేశారు. ఇటీవలే ముగిసిన ఇండియా-న్యూజిలాండ్ టీ20  సిరీస్ నేపథ్యంలో ఇంటికి దూరంగా ఉన్న భువీ..  గురువారం ఢిల్లీ వెళ్లి తన కూతురును చూడబోతున్నాడు. 

కాగా.. నిన్ననే  భువనేశ్వర్-నుపుర్ లు నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.  2017 నవంబర్ 23న వారి వివాహం జరిగింది.  పెళ్లి రోజు మరుసటి రోజే భువీ తండ్రి కావడం విశేషం.  భువీ తండ్రైన విషయం తెలుసుకున్న పలువురు భారత క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ఇటీవల కాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న భువీకి ఇది శుభవార్తే. టీ20 ప్రపంచకప్ లో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్న భువనేశ్వర్.. ఇటీవలే   న్యూజిలాండ్ తో ముగిసిన  మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో  అదిరిపోయే ప్రదర్శనలు చేయకున్నా నిలకడగా బౌలింగ్ చేశాడు. మూడు మ్యాచుల్లో కలిసి అతడు 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 

ఇప్పటికే భారత జట్టులోని  పలువురు  ఆటగాళ్ల ఇంట తొలిసారి ఆడపిల్లే జన్మించి వారి లోగిళ్లలో సంతోషాలను తీసుకొచ్చింది. వారిలో టీమిండియా మాజీ సారథి  ఎంఎస్ ధోని.. ప్రస్తుత టెస్టు, వన్డే సారథి విరాట్ కోహ్లి.. టీ20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు అజింక్యా రహానే, పుజారా ఇంట కూడా ఆడపిల్లే అడుగుపెట్టింది.  ఇప్పుడు భువీ కూడా ఆ జాబితాలో చేరాడు.

click me!