Srilanka Vs Bangladesh: ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ దశలో జరుగుతున్న మూడో మ్యాచ్ లో శ్రీలంక టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. క్వాలిఫయింగ్ రౌండ్ల నుంచి గ్రూప్ దశకు అర్హత సాధించిన ఈ రెండు జట్లకు తొలి మ్యాచ్ కీలకం కానున్నది.
క్వాలిఫయింగ్ రౌండ్లలో చెరో మ్యాచ్ ఓడిపోయినా అలవోకగా గ్రూప్ దశకు అర్హత సాధించిన శ్రీలంక (Srilanka).. బంగ్లాదేశ్ (bangladesh) నేడు పొట్టి ప్రపంచకప్ అసలు సమరానికి సిద్ధమయ్యామయి. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ‘గ్రూప్ ఆఫ్ డెత్’ (Group of death) గా పిలుస్తున్న ఈ గ్రూప్ లో బంగ్లాదేశ్, శ్రీలంక (Bangladesh vs srilanka) లకు ఈ మ్యాచ్ కీలకం కానున్నది.
ఈ గ్రూప్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి పటిష్ట జట్లున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంకకు ఈ మ్యాచ్ లో నెగ్గితేనే సెమీస్ అవకాశాలను సజావుగా చేరుకునే అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్ లలో వారు కఠిన ప్రత్యర్థులను ఎదుర్కోబోతున్నారు. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
గత ఆరు టీ20 ప్రపంచకప్ టోర్నీ (T20 world cup)లలో శ్రీలంక ఒకసారి కప్ గెలవగా.. రెండు సార్లు రన్నరప్ గా ఉంది. మరోసారి సెమీస్ కు చేరింది. ప్రస్తుత ఫామ్, జట్టు కూర్పు చూస్తుంటే కప్పు మీద శ్రీలంకకు ఆశలు లేకున్నా కనీసం సెమీస్ కైనా చేరాలని తహతహలాడుతున్నది. మరోవైపు బంగ్లా పులులు మాత్రం ఇంతవరకు గ్రూప్ స్టేజ్ కూడా దాటలేదు. కానీ గత కొద్దిరోజులుగా ఆ జట్టు పెద్ద జట్లకు కూడా షాకిస్తున్నది. ఇటీవలే బంగ్లాదేశ్.. ఆసీస్, న్యూజిలాండ్ లను ఓడించి సిరీస్ లు కూడా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా.. నేటి మ్యాచ్ లో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహేశ్ తీక్షణ ఆడటం లేదు. గాయం కారణంగా అతడు నేటి మ్యాచ్ కు దూరమవడం ఆ జట్టుకు పెద్ద లోటే. క్వాలిఫయింగ్ మ్యాచ్ లలో అతడు శ్రీలంక తరఫున 8 వికెట్లు తీసి ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తీక్షణ లేకున్నా తాము మాత్రం ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తామని శ్రీలంక సారథి దసున్ శనక (Dasun shanaka) తెలిపాడు.
ఇక క్వాలిఫయింగ్ మ్యాచ్ లలో తొలి మ్యాచ్ స్కాట్లాండ్ చేతిలో ఓడిన అద్భుతంగా పుంజుకున్న బంగ్లాదేశ్.. జోరు మీదుంది. ఆ జట్టు తరఫున ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ (shakib ul hasan) మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నాడు. బ్యాటింగ్ లో మహ్మద్ నయీం, షకిబుల్ హసన్, మహ్మదుల్లా (mahmudullah) లిటన్ దాస్ లు ఫాంలో ఉన్నారు. బౌలింగ్ లో షకిబ్ తో పాటు ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైఫుద్దీన్ చెలరేగుతున్నారు.
టీ 20లలో ఇరు జట్లు పదకొండు సార్లు పోటీ పడ్డాయి. ఇందులో ఏడింటిలో శ్రీలంక గెలవగా.. నాలుగు మ్యాచ్ లు బంగ్లాదేశ్ గెలిచింది. ఇక టీ 20 ప్రపంచకప్ లో ఇరు జట్లు ఒక మ్యాచ్ ఆడగా.. అందులో విజేతలు లంకేయులే.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తుది జట్లలో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. శ్రీలంక తరఫున మహేశ్ తీక్షణ బదులు బినుర ఫెర్నాండో ఆడుతుండగా.. బంగ్లా తరఫున టస్కిన్ అహ్మద్ స్థానంలో నసుమ్ అహ్మద్ ఆడుతున్నాడు.
జట్లు:
శ్రీలంక : పతుమ్ నిస్సాంక, కుసాల్ పెరీరా (వికెట్ కీపర్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిర కరుణరత్నే, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
బంగ్లాదేశ్: మహ్మద్ నయీం, లిటన్ దాస్, మహెది హసన్, షకిబ్ ఉల్ హసన్, నురుల్ హసన్ (వికెట్ కీపర్), అఫిఫ్ హుస్సేన్, మహ్మదుల్లా (కెప్టెన్), ముష్పీకర్ రహీమ్, మహ్మద్ సైఫుద్దీన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్