Squid Game Challenge: ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రమోషన్స్ లో భాగంగా భారత ఆటగాళ్లు నెట్టింట వైరల్ గా మారుతున్న స్క్విడ్ గేమ్ ఛాలెంజ్ ను స్వీకరించారు.
రెండో టీ20 ప్రపంచకప్ (T20 World cup) వేటలో ఉన్న భారత ఆటగాళ్లు.. అందుకోసం గ్రౌండ్ లో చెమటోడ్చుతున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ లలో సత్తా చాటారు. ఈనెల 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (pakistan) తో తలపడటానికి అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఆటగాళ్లు తీరికలేని షెడ్యూల్ తో బిజీలో ఉన్నా.. ఐసీసీ (ICC) టీ20 ప్రపంచకప్ ప్రమోషన్స్ కూడా అదరగొడుతున్నది.
ఇందులో భాగంగానే భారత ఆటగాళ్లతో స్క్విడ్ గేమ్ ఛాలెంజ్ (squid game challenge) ఆడించింది. ఈ ఛాలెంజ్ లో రోహిత్ శర్మ (Rohit Sharma), కెఎల్ రాహుల్ (KL rahul), సూర్య కుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సామాజిక మాధ్యమాల ఖాతాలలో పోస్టు చేసింది.
ఏమిటి స్క్విడ్ గేమ్ (squid game)..?
స్క్విడ్ గేమ్ అనేది దక్షిణా కొరియా కు చెందిన ఒక యాక్షన్ డ్రామాలోని ఎపిసోడ్. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఈ షో గురించి.. ఒక చిన్నటి బిస్కెట్ (క్యాండీ) ని ఇచ్చి దానిమీద ఒక చిన్న బొమ్మను వేస్తారు. నక్షత్రం గుర్తు, రౌండ్ సింబల్ వంటివి. అయితే చిన్న సూది వంటి పరికరంతో ఆ గీసిన బొమ్మను రూపొందించాలి. ఈ క్రమంలో క్యాండీ పగలకుండా బొమ్మ గీసినవాళ్లు విజేతలు. క్యాండీ కట్ అయితే విఫలమైనట్టు లెక్క. అయితే దీనికి నిర్ణీత సమయం కేటాయిస్తారు. ఆ టైమ్ లోపలే దానిని కట్ చేయాలి. ఆన్ లైన్ లో ఈ గేమ్ ఛాలెంజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
కాగా, ఇదే గేమ్ ను ఇప్పుడు టీమ్ ఇండియా (Team India) ప్లేయర్లు ఆడారు. ఈ క్రేజీ ఛాలెంజ్ లో కెఎల్ రాహుల్, బుమ్రా, యాదవ్, వరుణ్ చక్రవర్తిలు విఫలమవ్వగా ఎంతో పేషెన్స్ తో ఆడిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, పేసర్ షమి లు విజయవంతమయ్యారు. పోస్టు కింద రోహిత్ శర్మ కామెంట్ కూడా చేశాడు. ప్లేయర్ నెంబర్ 45, ప్లేయర్ నెంబర్ 11 గెలిచారని రాసుకొచ్చాడు. ఆ రెండు జెర్సీలు రోహిత్, షమీ వే కావడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నది. టీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఇప్పటికే రెండు వార్మప్ మ్యాచ్ లు విజయవంతంగా ముగించిన ఇండియా(India).. ఈ ఆదివారం పాకిస్తాన్ (India vs Pakistan) తో తలపడబోతున్నది.