
క్రికెట్లో గొప్ప బ్యాటర్ ఎవరంటే చర్చ జరుగుతుందేమో కానీ క్రేజ్ విషయంలో ‘కింగ్’ ఒకే ఒక్కడు... విరాట్ కోహ్లీ. సోషల్ మీడియాలో ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ అథ్లెట్గా టాప్ 3లో నిలిచిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండీస్ టూర్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న విరాట్ కోహ్లీ, అలీబాగ్లో తన ఫామ్హౌజ్ నిర్మాణ పనులను సమీక్షించాడు..
త్వరలో ఆసియా కప్ 2023 ప్రిపరేషన్స్ కోసం బెంగళూరులో బీసీసీఐ ఏర్పాటు చేసే క్యాంపులో పాల్గొనబోతున్నాడు విరాట్ కోహ్లీ.. కోహ్లీ కోసం ఓ వజ్రాల పొదిగిన బ్యాటును రూపొందించాడు సూరత్లోని ఓ వ్యాపారవేత్త. కొన్ని నెలల పాటు శ్రమించి, రూపొందించిన ఈ బ్యాటు తయారీకి 1.04 క్యారెట్ల ఒరిజినల్ డైమండ్లను వాడాడు..
ఈ బ్యాటు ఖరీదు దాదాపు రూ.10 లక్షల వరకూ ఉంటుంది. ఇప్పటికే ఈ డైమండ్ బ్యాటు తయారీ పూర్తయ్యింది. సర్టిఫికేషన్ కోసం సూరత్లోని లెక్సస్ సాఫ్ట్మ్యాక్ కంపెనీకి పంపారు.
‘భారత టాప్ క్రికెటర్కి డైమండ్ బ్యాటుని బహుమతిగా ఇవ్వాలని ఓ సూరత్ వ్యాపారి భావిస్తున్నాడు. దీని కోసం ల్యాబ్లో తయారుచేసిన డైమండ్స్ కాకుండా సహజసిద్ధమైన వజ్రాలను వాడారు. దీని సైజు 15 మిల్లీ మీటర్ల నుంచి 5 మిల్లిమీటర్ల వరకూ ఉంటుంది. సహజసిద్ధంగా భూగర్భంలో తయారైన వజ్రాల మెరుపుని, ల్యాబ్తో రూపొందించిన వజ్రాలు అస్సలు అందుకోలేవు. ఈ బ్యాటును చాలా జాగ్రత్తగా కాపాడాల్సిందిగా మాకు గట్టిగా చెప్పారు..’ అంటూ డైమండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉత్పల్ మిస్త్రీ తెలిపాడు.
ఆసియా కప్ 2023 టోర్నీ కోసం త్వరలో శ్రీలంకకు బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఉంటుంది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 వార్మప్ మ్యాచులు ప్రారంభం అవుతాయి.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీకి ఈ డైమండ్ బ్యాటును బహుకరించాలని భావిస్తున్నాడట ఆ సూరత్ వ్యాపారి..
2022 ఆసియా కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచిన విరాట్ కోహ్లీ, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా టాప్లో నిలిచాడు. 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ శర్మ 9 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలతో 648 పరుగులు చేశాడు. అయితే ఇదే సిరీస్లో విరాట్ కోహ్లీ 55.38 సగటుతో 443 పరుగులు చేసి టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు..
2019 వన్డే వరల్డ్ కప్లో 5 హాఫ్ సెంచరీలు చేసి, ఒకే వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత కెప్టెన్గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈసారి విరాట్ పైన చాలా నమ్మకాలు పెట్టుకుంది టీమిండియా. రిషబ్ పంత్ జట్టుకి అందుబాటులో లేకపోవడం, శ్రేయాస్ అయ్యర్ ఫిట్నెస్పై పూర్తి క్లారిటీ రాకపోవడంతో విరాట్ కోహ్లీపైనే బ్యాటింగ్ భారం పడనుంది..
కెఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా, వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో అతని నుంచి సరైన పర్ఫామెన్స్ ఆశించడం అత్యాశే అవుతుంది. శుబ్మన్ గిల్, మంచి ఫామ్లో ఉన్నా నిలకడైన ప్రదర్శన చూపించడంలో విఫలమవుతున్నాడు.