
Nitish Kumar Reddy Father Emotional Video: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపుతున్నాడు. ఈ సిరీస్ లో కష్ట సమయంలో భారత్ కు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి మరోసారి అదే తరహా ఇన్నింగ్స్ తో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. తన టెస్టు క్రికెట్ కెరీర్ లో తొలి సెంచరీ సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాల్గవ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తన తొలి టెస్ట్ సెంచరీని కొట్టాడు.
నితీష్ కుమార్ తన సెంచరీని పూర్తి చేయడానికి బౌండరీని బాదాడు. తన కొడుకు సెంచరీ కొట్టడంతో అతని తండ్రి ఉద్వేగానికి లోనయ్యారు. స్టాండ్స్లో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సెంచరీకి చేరువవుతున్న సమయంలో నితీష్ తండ్రి దేవుడికి ప్రార్థనలు చేస్తూ కనిపించారు. 115వ ఓవర్లో తన కుమారుడు అద్భుతమైన సెంచరీని సాధించడంతో ఆయన కన్నీళ్లు పెట్టుకుని పక్కనున్న వారితో కలిసి నితీస్ కుమార్ రెడ్డి సెంచరీ సంబరాలు చేసుకున్నారు. హాఫ్ సెంచరీని 'నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. నీయవ్వ దగ్గేదే లే' అంటూ సంబరాలు చేసుకున్న నితీష్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత దాన్ని సెంచరీగా మలిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మూడో రోజు ఆటలో భారత్ తొలి సెషన్లో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, త దర్వాత బ్యాటింగ్ కు కొనసాగించిన యంగ్ ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు 8వ వికెట్కు 127 పరుగులు జోడించారు. సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
వాషింగ్టన్ సుందర్ కంటే వేగవంతమైన స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి 171 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్ లో తనకు ఇది తొలి సెంచరీ. మరో ఎండ్ లో వికెట్లు పడుతున్న సమయంలో నితీష్ రెడ్డి సెంచరీని కోల్పోతాడా అనే పరిస్థితి కనిపించింది. కానీ, మరో ఎండ్ లో మహ్మద్ సిరాజ్ తోడుగా ఉండటంతో నితీస్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో తన తొలి సెంచరీని పూర్తి చేశాడు.
సెంచరీ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తండ్రి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు. దీనిని మా జీవితంలో మర్చిపోలేము. అతను 14-15 సంవత్సరాల వయస్సు నుండి మంచి ప్రదర్శన చేస్తున్నా. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించడం.. ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి'' అని నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి తెలిపారు. కాగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 358/9 (116) పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగులు, మహ్మద్ సిరాజ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది.