
కొద్దిగంటల క్రితం దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన బెత్ మూనీకి బంపరాఫర్ దక్కింది. వచ్చే నెల 4 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో భాగంగా గుజరాత్ జెయింట్స్ కు ఆమె సారథిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. గుజరాత్ టీమ్ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్నా ఇప్పటికే దీనిపై లీకులు కూడా ఇచ్చేసింది.
మూనీ పేరును గుజరాత్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. అంతకుముందే ట్విటర్ లో ఓ క్విజ్ పెట్టింది. తన అధికారిక ఖాతా (గుజరాత్ జెయింట్స్) లో టీ20లలో హయ్యస్ట్ స్కోరర్, బెలిందా క్లార్క్ మెడల్ విన్నర్, ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2020లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. అని హింట్ ఇచ్చింది. ఇవన్నీ బెత్ మూనీ పేరిటే ఉన్నాయి.
మూనీ ఆస్ట్రేలియా టీమ్ తరఫున కీలకమైన ప్లేయర్. ఆ జట్టు 2018, 2020, 2023లలో గెలిచిన టీ20 ప్రపంచకప్ లలో మూనీ సభ్యురాలిగా ఉంది. 2020 ప్రపంచకప్ లో ఆమె ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఉంది. 2020 తో పాటు 2023 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఆమె హాఫ్ సెంచరీలు బాదింది.
ఇక ఆదివారం దక్షిణాఫ్రికాతో ముగిసిన 2023 ఫైనల్స్ లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 156-6 పరుగులు చేసింది. ఇందులో మూనీ చేసినవే 74 పరుగులు కావడం గమనార్హం. మిగతా ప్లేయర్లు విఫలమైన చోట మూనీ అద్భుతంగా పోరాడింది.
కాగా ఇటీవలే ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం ప్రక్రియలో బెత్ మూనీ తో పాటు ఆసీస్ ఆల్ రౌండర్ ఆష్లే గార్డ్నర్ ను కూడా గుజరాత్ దక్కించుకుంది. ఆమెనే గుజరాత్ ను నడిపించనుందని వార్తలు వచ్చాయి. కానీ గార్డ్నర్ ను కాదని గుజరాత్.. మూనీకి అవకాశం ఇస్తుండటం గమనార్హం.
వేలంలో గుజరాత్ జెయింట్స్ దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా: ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ, సోఫి డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేహ్ రాణా, సబ్బినేని మేఘన, జార్జియా వెర్హమ్, మన్షీ జోషి, హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, షబ్నమ్ షకీల్, సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరుణిక సిసోడియా