
మీడియా సమావేశాలలో రిపోర్టర్లు వేసే ప్రశ్నలకు తలతిక్క సమాధానాలు చెప్పడమో లేదా వారిని కోపంగా చూడటమో చేసి విమర్శలపాలయ్యే పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ తాజాగా చేసిన ఓ పనికి అంతా ఫిదా అయ్యారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) - 2023 వ సీజన్ లో భాగంగా కరాచీ కింగ్స్ - పెషావర్ జల్మీ మధ్య ముగిసిన మ్యాచ్ లో బాబర్.. గ్రౌండ్ లో వాటర్ బాటిల్స్, చెత్తను ఏరుతూ కనిపించాడు.
పెషావర్ - కరాచీ మ్యాచ్ ముగిసిన తర్వాత బాబర్.. గ్రౌండ్ లో బౌండరీ లైన్ వద్ద ఉన్న వాటర్ బాటిల్స్, తినుబండారాలకు సంబంధించిన ప్యాకెట్లు, చెత్తా చెదారాన్ని ఎత్తుతూ కనిపించాడు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు.. బౌండరీ లైన్ వద్ద ఈ చెత్తనంతా పడేయడంతో మ్యాచ్ తర్వాత గ్రౌండ్ సిబ్బంది వాటిని క్లీన్ చేయడం చూసిన బాబర్ వారికి తనవంతు సాయాన్ని అందించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బాబర్ కు పాకిస్తాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. టీమిండియాలో కోహ్లీ ఎలాగో పాకిస్తాన్ లో బాబర్ కు అంతే క్రేజ్ ఉంది. మన పరిసరాలను శుభ్రంగా ఉంచాలనే సందేశాన్ని బాబర్ చెప్పకనే చెప్పాడు. ఈ వీడియోలో బాబర్ తో పాటు మరికొంతమంది పెషావర్ జల్మీ ఆటగాళ్లు కూడా బౌండరీ లైన్ వద్ద చెత్తను ఎత్తుతూ కనిపించారు.
ఇక పీఎస్ఎల్ లో తన మాజీ టీమ్ కరాచీ కింగ్స్ తో ఇటీవలే ముగిసిన మ్యాచ్ లో పెషావర్ జల్మీ రెండు పరుగుల తేడాతో గెలిచి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున షోయభ్ మాలిక్ (52), కెప్టెన్ ఇమాద్ వసీం (80 నాటౌట్)రాణించారు. కాగా పెషావర్ టీమ్ లో బాబర్ ఆజమ్ (64), కొహ్లెర్ కాడ్మోర్ (92) వీరబాదుడు బాది ఆ జట్టుకు సూపర్ విక్టరీ అందించారు. కరాచీ.. నిన్న ఇస్లామాబాద్ తో ముగిసిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఓడింది. ఈ లీగ్ లో నేడు పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.