
ఐపీఎల్ లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత మూడేండ్లకు.. ఇక కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో గతేడాదికి ముందు దేశవాళీతో పాటు ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన ఈ తమిళ తంబీ.. భారత జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్-2022 లో అయితే కార్తీక్ వీరవిహారం చేశాడు. ఆ సీజన్ లో కార్తీక్ ఆటతో బీసీసీఐ సెలక్టర్లు కూడా రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లను పక్కనబెట్టి ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ లలో డీకేను ఎంపిక చేశారు.
ఐపీఎల్ - 15వ సీజన్ లో కార్తీక్.. 16 మ్యాచ్ లలో 16 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతడు 55 సగటు, 183 స్ట్రైక్ రేట్ తో 333 పరుగులు చేశాడు. వికెట్ల వెనుక కూడా చురుగ్గా కదిలాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతడికి భారత జట్టులో చోటు దక్కింది.
కానీ ఏడాది తిరిగేసరికి అంతా తారుమారయ్యింది. ఈ సీజన్ లో కార్తీక్ ఆరు మ్యాచ్ లలో ఆరు ఇన్నింగ్స్ ఆడి చేసింది 45 పరుగులే. సగటు 9 గా ఉంది. ఇందులో రెండు గోల్డెన్ డక్లు ఉన్నాయి. మొత్తంగా ఈ సీజన్ లో 0, 9, 1, 0, 28, 7 పరుగులు చేశాడు. పోనీ వికెట్ల వెనుక ఏమైనా ధోనిని మరిపించే ప్రదర్శనలు చేస్తున్నాడా..? అంటే అదీ లేదు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు పరుగులకే ఔటయ్యాక సోషల్ మీడియాలో ట్రోలర్స్ అతడిని ఆడుకుంటున్నారు.
కార్తీక్ ఇక క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి వీలున్నంత త్వరగా కామెంట్రీ బాధ్యతలు చూసుకోవడం బెటర్ అని నెటిజన్లు అతడికి సూచిస్తున్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్ లో ఆడటమే తన లక్ష్యంగా మెరుగైన ప్రదర్శనలు చేసిన కార్తీక్.. ఇక మళ్లీ జాతీయ జట్టులో ఆడటం కష్టమని తెలిసి మరీ దారుణంగా ఆడుతున్నాడని వాపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కార్తీక్ కు ఇదే ఆఖరి సీజన్ అవుతుందని చెబుతున్న వారూ లేకపోలేదు.
కాగా పంజాబ్ - ఆర్సీబీ మధ్య మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్.. 18.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.