
జోహన్నస్బర్గ్ లోని వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాను పోటీలోకి తెచ్చిన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తున్నది. వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీసి సఫారీల టాపార్డర్ ను కూల్చిన అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లంచ్ కు ముందు బౌలింగ్ కు వచ్చిన ఠాకూర్.. 5 ఓవర్లలోపే మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత శిబిరంలో జోష్ నింపాడు. దీంతో అప్పటిదాకా నిస్సారంగా మ్యాచ్ చూస్తున్న టీమిండియా అభిమానులు ఆనందోత్సహాల్లో మునిగితేలారు.
బౌలింగ్ కు రావడంతోనే నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్ (28) ను పెవిలియన్ కు పంపిన ఠాకూర్.. ఆ తర్వాత వరుస ఓవర్లలో హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న పీటర్సన్ (62) తో పాటు ప్రమాదకర బ్యాటర్ డసెన్ (1) ను కూడా ఔట్ చేశాడు.
ఠాకూర్ తాజా ప్రదర్శనపై ట్విట్టర్ లో టీమిండియా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఠాకూర్ పై మీమ్స్, వీడియోలతో అతడి ముద్దు పేరు ‘లార్డ్’అని పిలుస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయమై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ.. ‘లార్డ్ శార్దూల్ ఠాకూర్, టీమిండియాలు ఫెయిర్ ప్లే ను నమ్ముతారు. అందుకే ఠాకూర్.. కొత్త బ్యాటర్లకు బౌల్ చేయడు. అతడు భాగస్వామ్యాలను విడదీస్తాడు...’అని ట్వీట్ చేశాడు.
పలువురి యూజర్ల ట్వీట్లు ఇలా ఉన్నాయి.. ‘అరిచి, పరిగెత్తండి.. దాక్కోండి.. లార్డ్ శార్దూల్ వేట మొదలుపెట్టాడు. ఇది అనివార్యం. అతడు తన నియమాలను పక్కాగా ఆచరిస్తాడు..’, ‘లార్డ్ శార్దూల్ ఠాకూర్ తన పని తాను చేసుకుంటూ పోయాడు..’ ‘భాగస్వామ్యాలను బ్రేక్ చేయాలంటే టీమిండియాలో శార్దూల్ ఠాకూర్ తర్వాతే ఎవరైనా...’, ‘గోల్డెన్ ఆర్మ్ (చేయి) ఉన్న వ్యక్తి శార్దుల్ ఠాకూర్..’, ‘మాకు మా ప్రభువు ఠాకూర్ పై పూర్తి నమ్మకముంది..’ ‘భారత్ కు వికెట్ అవసరమైన ప్రతీసారి అందరూ శార్దూల్ ఠాకూర్ వైపే చూస్తారు. ఆ ప్రభువు (శార్దూల్) వచ్చి మనను ఆశీర్వదిస్తాడు. అతడి ఆధిపత్యానికి అందరూ సలాం చేస్తారు..’ అని ట్వీట్ల వర్షం కురుస్తున్నది. కీలక సమయంలో వికెట్లు తీసిన అతడిపై ‘మా దేవుడు నువ్వేనయ్యా.. మాకోసం వచ్చావయ్యా..’ అంటూ మీమ్స్ పోటెత్తుతున్నాయి.
ఇదిలాఉండగా తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ను టెంబ బవుమా (29 నాటౌట్), వికెట్ కీపర్ వెరెన్నే (20 నాటౌట్) ఆదుకున్నారు. భారత పేస్ త్రయాన్ని ధీటుగా ఎదుర్కుంటున్న ఈ ద్వయం.. ఇప్పటికే 51 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది. 62 ఓవర్లు ముగిసేసరికి సఫారీలు 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేశారు. టీమిండియా కంటే ఆ జట్టు ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది.