5 వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బతీసిన వరుణ్ చక్రవర్తి...
ప్యాట్ కమ్మిన్స్కి మూడు వికెట్లు...
47 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్...
59 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన కేకేఆర్...
IPL 2020: టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. కోల్కత్తా నైట్రైడర్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యచేధనలో ఏ దశలోనూ టార్గెట్వైపు పయనించలేకపోయింది యంగ్ ఢిల్లీ టీమ్. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకి పరిమితమైంది ఢిల్లీ క్యాపిటల్స్.
ఇన్నింగ్స్ మొదలెట్టిన మొదటి బంతికే అజింకా రహానే అవుట్ కాగా... ఆ తర్వాత కొద్దిసేపటికే గత రెండు మ్యాచ్ల సెంచరీ హీరో శిఖర్ ధావన్ 6 పరుగులకే అవుట్ అయ్యాడు.13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని ఆదుకునే ప్రయత్నం చేశారు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్. మూడో వికెట్కి 63 పరుగులు జోడించిన తర్వాత 33 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్తో 27 పరుగులు చేసిన రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు.
హెట్మయర్ 10 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేసి కాసేపు పోరాడాడు. హెట్మయర్, అయ్యర్ వెంటవెంటనే అవుట్ కావడంతో మ్యాచ్పై ఆశలు వదులుకుంది డీసీ. స్టోయినిస్ 6, అక్షర్ పటేల్ 9 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఏకంగా 5 వికెట్లు తీసి ఢిల్లీ పతనంలో ప్రధాన పాత్ర పోషించాడు. పాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు తీశాడు.