
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 98 నాటౌట్, 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి తన బ్యాటింగ్ పవర్ ను చూపించాడు. భారత క్రికెట్ మక్కాగా అభివర్ణించే ఈడెన్ గార్డెన్ లో తన బ్యాటింగ్ విన్యాసాలతో అలరించాడు. ‘కుదిరితే సిక్స్, మినిమం ఫోర్’ అన్న రేంజ్ లో ఈడెన్ గార్డెన్ లో తుఫాను రేపాడు. ఐపీఎల్ లో అతి తక్కువ బంతుల్లోనే అర్థ సెంచరీ రికార్డును బ్రేక్ చేసి రాజస్తాన్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచాడు. కేకేఆర్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యం జైస్వాల్ బాదుడకు మరీ చిన్నదిగా కనిపించింది. జైస్వాల్ తో పాటు రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (29 బంతుల్లో 48 నాటౌట్, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా రెచ్చిపోవడంతో ఆ జట్టు.. 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది.
ఈజీ టార్గెట్ను రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన బాదుడుతో మరింత ఈజీగా మార్చేశాడు. ఈ సీజన్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న యశస్వి.. నితీశ్ రాణా వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ లోనే 6, 6, 4, 4, 2, 4తో 26 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే ఇన్ని రన్స్ చేసిన తొలి ఆటగాడు జైస్వాలే.
హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్లో నాలుగో బాల్ కు బట్లర్ (0) రనౌట్ అయ్యాడు.ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఆనందపడ్డ క్షణాలు అవే. ఆ తర్వా జైస్వాల్ మరింత రెచ్చిపోయాడు. కెప్టెన్ సంజూ శాంసన్ అండగా ఇద్దరూ కలిసి ‘నీకో సిక్స్.. నాకో సిక్స్..’ అన్నట్టుగా కేకేఆర్ బౌలర్లను చితకబాదారు.
బట్లర్ నిష్క్రమించిన అదే ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన జైస్వాల్.. శార్దూల్ ఠాకూర్ వేసిన 3 ఓవర్లో 4,4,4 బాదాడు. దీంతో 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు ఉన్న కెఎల్ రాహుల్, పాట్ కమిన్స్ (14 బంతులు) రికార్డును బ్రేక్ చేశాడు.
జైస్వాల్ కొడుతుంటే తానేమైనా తక్కువ తిన్నానా అన్నట్టుగా కెప్టెన్ సంజూ కూడా బ్యాట్ కు పనిచెప్పాడు. వరుణ్ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్లో 6,4 కొట్టాడు. పవర్ ప్లేలోనే రాజస్తాన్ స్కోరు కేకేఆర్ లక్ష్యంలో సగం (78) దాటేసింది. 78లో జైస్వాల్ చేసినవే 62 పరుగులు కావడం గమనార్హం. ఇద్దరూ కలిసి బౌలర్లను పంచుకుని బాదడంతో 9 వ ఓవర్లోనే రాజస్తాన్ స్కోరు వంద పరుగులు దాటింది.
అనుకూల్ రాయల్ వేసిన 11వ ఓవర్లో శాంసన్ మూడు భారీ సిక్సర్లు బాది లక్ష్యాన్ని మరింత చిన్నది చేశాడు. ఇక ఆఖర్లో జైస్వాల్.. శార్దూల్ వేసిన 14వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు ఫోర్ కొట్ట రాజస్తాన్ కు సూపర్ డూపర్ విక్టరీని అందించాడు. రెండు పరుగులతో సెంచరీ మిస్ అయినా యశస్వి వీరవిహారంతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.