
ఐపీఎల్-16లో అంపైరింగ్ విధానంపై నిత్యం విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ లు, నోబాల్స్, బంతి బ్యాట్ కు తగలకున్నా ఔట్ అని ప్రకటించడం వివాదాలకు దారి తీస్తున్నది. తాజాగా మరోసారి డీఆర్ఎస్, థర్డ్ అంపైర్ డిసీషన్ వివాదాస్పదమైంది. ముంబై - బెంగళూరు మ్యాచ్ లో భాగంగా ఎంఐ సారథి రోహిత్ శర్మను అంపైర్ ఔట్ ఇచ్చిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్నటి మ్యాచ్ లో రోహిత్.. 8 బంతుల్లో ఏడు పరుగులు చేసి వనిందు హసరంగ వేసిన ఐదో ఓవర్ ఆరో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే రోహిత్ ది ఔట్ కాదని స్వయంగా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్ తో పాటు పలువురు మాజీలు రుజువులతో సహా నిరూపిస్తున్నారు.
నిబంధనల ప్రకారం.. ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చేప్పుడు బంత పడ్డ ప్రదేశం వికెట్లకు 300 సెంటిమీటర్లు (3మీటర్ల మార్కు)లో ఉండాలి. అలా కాకుండా బాల్ అంతకుముందే పిచ్ ను తాకితే మాత్రం దానిని నాటౌట్ గానే పరిగణిస్తారు.
తాజాగా రోహిత్ శర్మ ఔట్ అయిన దానిని పరిశీలిస్తే బంతి అతడి ప్యాడ్ కు తాకిన దూరానికి వికెట్లకు 3.7 మీటర్ల వ్యత్యాసం ఉంది. ఇది క్లీయర్ గా నాటౌట్. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బంతిని వికెట్లను తాకుతుందా..? లేదా..? అన్నది మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఇచ్చాడని మునాఫ్ పటేల్ తో పాటు రోహిత్ అభిమానులు వాపోతున్నారు.
ఇక నిన్నటి మ్యాచ్ లో 200 పరుగుల లక్ష్యఛేదనను ముంబై 16.3 ఓవర్లలోనే దంచేసింది. రోహిత్ విఫలమైనా సూర్యకుమార్ యాదవ్. 35 బంతుల్లో 7 బౌండరీలు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. అతడికి తోడుగా నెహల్ వధేరా కూడా 34 బంతులలోనే 4 బౌండరీలు, 3 సిక్సర్లతో 52 రన్స్ చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్.. 21 బంతుల్లోనే 4 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.