
ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో కరోనా కేసులు వెలుగుచూడడంతో అర్ధాంతరంగా సగం సీజన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఏప్రిల్లో ఫస్ట్ ఫేజ్ జరిగితే, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు సెప్టెంబర్లో సెకండ్ ఫేజ్ నిర్వహించింది బీసీసీఐ... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు పరాభవానికి, ఐసీసీ టోర్నీకి ఆరంభానికి ముందు ఐపీఎల్ నిర్వహించడమే కారణమని వినిపించింది...
ఇప్పుడు కూడా అదే భయం క్రికెట్ ఫ్యాన్స్లో కలుగుతోంది. ఐపీఎల్ 2021 సీజన్లో 29 మ్యాచులు ముగిసిన తర్వాత కరోనా కేసులు వెలుగు చూస్తే, 2022 సీజన్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. మూడు రోజుల కిందట ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజయో ప్యాట్రిక్ ఫార్హర్ట్ కరోనా పాజిటివ్గా తేలడంతో ఐపీఎల్ ఫ్యాన్స్ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు...
అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లకు నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రావడంతో ఐపీఎల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కూడా ఆడింది ఢిల్లీ క్యాపిటల్స్..
ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడేందుకు పూణే బయలుదేరి వెళ్లాల్సి ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. పూణేకి బయలుదేరే ముందు చేసిన కరోనా పరీక్షల్లో ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్తో పాటు సపోర్టింగ్ స్టాఫ్కి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలింది...
దీంతో మరోసారి ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పాకిస్తాన్లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న మిచెల్ మార్ష్తో పాటు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, ప్యాట్ కమ్మిన్స్ వంటి ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆ పర్యటన కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొదటి వారం మ్యాచులకు దూరంగా ఉన్నాడు...
పాకిస్తాన్ పర్యటనలో గాయపడిన మిచెల్ మార్ష్, ఐపీఎల్ 2022 సీజన్లో పాల్గొనడం అనుమానమేనని ప్రచారం జరిగింది. అయితే గాయం నుంచి త్వరగానే కోలుకున్న మిచెల్ మార్ష్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో ఆడాడు.
వన్డౌన్లో బ్యాటింగ్కి వచ్చి 24 బంతుల్లో 14 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు మిచెల్ మార్ష్. మిచెల్ మార్ష్కి కరోనా పాజిటివ్గా తేలడంతో ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు ఆర్సీబీ ప్లేయర్లు కూడా భయాందోళనలకు గురి అవుతున్నారు... అయితే మిచెల్ మార్ష్కి మరోసారి చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది...
ముందు జాగ్రత్తగా మిచెల్ మార్ష్ని, అతనితో సన్నిహితంగా ఉన్న ప్లేయర్లను రెండు రోజుల పాటు క్వారంటైన్కి తరలించబోతున్నారు ఐపీఎల్ యాజమాన్యం. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సమయానికి మరో రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ రాకపోతే... అందుబాటులో ఉన్న ప్లేయర్లతో మ్యాచ్ నిర్వహిస్తారు...
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లో కరోనా పాజిటివ్ కేసులు రావడానికి కారణాలేంటి? అనే కోణంలో విచారణ జరుపుతోంది ఐపీఎల్ యాజమాన్యం, బీసీసీఐ... బయో బబుల్ జోన్లో పాజిటివ్ కేసులు ఎలా నమోదయ్యాయి? ఏ ప్లేయర్ అయినా బయో సెక్యూర్ జోన్ దాటి బయటికి వెళ్లాడా? లేక బయటి వ్యక్తులు ఎవరైనా బయో బబుల్లోకి అనుమతి లేకుండా వచ్చారా? అనేది తేలాల్సి ఉంది.
ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ బయో బబుల్ జోన్ నిర్వహణలో లోపాలున్నాయని తేలితే ఆ ఫ్రాంఛైజీకి కోటి రూపాయల వరకూ జరిమానా విధించనుంది ఐపీఎల్ యాజమాన్యం.