ధీటుగా బదులిస్తున్న టీమిండియా.. సెంచరీ దిశగా గిల్..

Published : Mar 11, 2023, 11:44 AM IST
ధీటుగా బదులిస్తున్న టీమిండియా.. సెంచరీ దిశగా గిల్..

సారాంశం

INDvsAUS 4th Test: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ధీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో  నేడు ఉదయమే రోహిత్ వికెట్ కోల్పోయినా  నిలకడగా ఆడుతోంది.   

అహ్మదాబాద్ టెస్టులో భారత జట్టు  ధీటుగా బదులిస్తోంది.  మూడో రోజు ఉదయం తొలి సెషన్ లో  బ్యాటింగ్ కు వచ్చిన భారత్.. రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినా తర్వాత   నిలకడగా ఆడుతోంది.  శుభ్‌మన్ గిల్ (119 బంతుల్లో 65 నాటౌట్, 5ఫోర్లు, 1 సిక్సర్)  కు తోడుగా ఛటేశ్వర్ పుజారా (46 బంతుల్లో 22 నాటౌట్, 1 ఫోర్) లు  భారత ఇన్నింగ్స్ ను నడిపిస్తున్నారు.  ప్రస్తుతం లంచ్ సమయానికి 37  ఓవర్లలో  ఒక వికెట్ నష్టానికి  129 పరుగులు చేసింది. 


మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు  36-0  వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన  భారత్..  దూకుడుగానే ఆడింది. స్టార్క్ వేసిన  12 వఓవర్లో గిల్  చూడముచ్చటైన బౌండరీ సాధించాడు. అదే ఓవర్లో మరో ఫోర్ కూడా బాదాడు. ఈ ఓవర్లో భారత్ 14 పరుగులు సాధించింది.  

స్టార్కే వేసిన  14వ ఓవర్లో రోహిత్.. ఓ ఫోర్, సిక్సర్ బాదాడు. క్రీజులో నెమ్మదిగా కుదురుకుంటున్నారనుకున్న  తరుణంలో  కున్హెమన్  ను స్మిత్ బరిలోకి దించాడు.  అతడు  20వ ఓవర్లో   ఆఖరి బంతికి హిట్ మ్యాన్ ను పెవిలియన్ కు పంపాడు.  తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని డ్రైవ్ చేయబోయిన రోహిత్..  కవర్ పాయింట్ వద్ద  ఉన్న లబూషేన్  చేతికి చిక్కాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది.   

రోహిత్ నిష్క్రమణ తర్వాత  వచ్చిన  పుజారా తో కలిసి గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇద్దరూ కలిసి ఆసీస్ పేసర్లు, స్పిన్నర్ల త్రయాన్ని సమర్థంగా ఎదుర్కుంటున్నారు. స్టార్క్ వేసిన  28వ ఓవర్లో  రెండో బంతిని బౌండరీకి తరలించిన గిల్  హాఫ్ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు.   ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ సెంచరీ దిశగా సాగుతున్నాడు. పుజారా కూడా బెదురు లేకుండా  స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు.  

దిగ్గజాల సరసన రోహిత్ .. 

ఈ మ్యాచ్ లో  రోహిత్ 22 పరుగులు చేయగానే  ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.   17 పరుగుల ఓవర్ నైట్  స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కు వచ్చిన  రోహిత్..  మరో ఐదు పరుగులు చేయగానే అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ తరఫున  17 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు.  భారత మాజీ క్రికెట్ దిగ్గజం  సచిన్ టెండూల్కర్ తో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా   విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనిలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

భారత్ నుంచి అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసన వీరులు : 

1. సచిన్ టెండూల్కర్ : 664 మ్యాచ్ లలో 34,357 పరుగులు 
2. విరాట్ కోహ్లీ : 494 మ్యాచ్ లలో 25,047  
3. రాహుల్ ద్రావిడ్ : 504 మ్యాచ్ లలో  24,064 
4. సౌరవ్ గంగూలీ : 421 మ్యాచ్ లలో 18,433 
5. ఎంఎస్ ధోని : 535 మ్యాచ్ లలో 17,092 
6. రోహిత్ శర్మ : 438 మ్యాచ్ లలో 17,015 

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !