కివీస్ ను ఆదుకుని.. భారత్‌కు ఆశలు కల్పించిన మిచెల్.. రెండో ఇన్నింగ్స్ లో తడబడుతున్న లంక..

Published : Mar 11, 2023, 11:15 AM IST
కివీస్ ను ఆదుకుని.. భారత్‌కు ఆశలు కల్పించిన మిచెల్..  రెండో ఇన్నింగ్స్ లో తడబడుతున్న లంక..

సారాంశం

NZvsSL: జూన్ లో జరుగబోయే  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్   లో భారత్ ఫైనల్ బెర్త్ ను సాధించాలంటే  ప్రస్తుతం ఆసీస్ తో ఆడుతున్న మ్యాచ్ తో పాటు శ్రీలంక - న్యూజిలాండ్ ల మ్యాచ్ ఫలితం కూడా కీలకం కానున్నదన్న విషయం తెలిసిందే.  

క్రైస్ట్‌చర్చ్ వేదికగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య  జరుగుతున్న తొలి టెస్టులో తొలుత తడబడ్డా  కివీస్ తర్వాత పుంజుకుంది.  డారిల్ మిచెల్ అద్భుత శతకానికి తోడు  లోయరార్డర్  లో హెన్రీ  రెచ్చిపోవడంతో  తొలి ఇన్నింగ్స్ లో  లంక కంటే ఎక్కువ స్కోరే చేసింది.  డారెల్ మిచెల్  (102)  సెంచరీ చేయగా  హెన్రీ (75 బంతుల్లో 72, 10ఫోర్లు, 3 సిక్సర్లు)  వన్డే తరహా ఆట ఆడాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలండ్.. 373 పరుగులకు ఆలౌట్ అయింది.  

ఓవర్ నైట్ స్కోరు  162-5 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన  కివీస్ జట్టును  మిచెల్ ఆదుకున్నాడు. మైఖేల్ బ్రాస్‌వెల్  (25) నిరాశపరిచాడు. కెప్టెన్ టిమ్  సౌథీ  (25) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు.   

ఒకవైపు వికెట్లు పడుతున్నా మిచెల్ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు.   హెన్రీ వచ్చిన తర్వాత  మిచెల్  కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరూ 9 వ వికెట్ కు 69 పరుగులు జోడించారు.  మిచెల్ నిష్క్రమించే సమయానికి న్యూజిలాండ్..  291-8 గానే ఉంది. కానీ హెన్రీ  మెరుపులతో కివీస్   తొలి ఇన్నింగ్ప్ లో లంక  స్కోరు (355) ను దాటేసింది.  చివర్లో వాగ్నర్  (24 బంతుల్లో 27, 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో   తొలి ఇన్నింగ్స్ లో కివీస్   373 పరుగులు చేయగలిగింది.  ఫలితంగా  మొదటి ఇన్నింగ్స్ లో  18 పరుగుల  స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది.  

 

కాగా   రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక..   ఇప్పటికే  మూడు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో  (28), దిముత్ కరుణరత్నే (17) లు విఫలమయ్యారు.  వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్  (14) కూడా నిరాశపరిచాడు.   ప్రస్తుతం   ఏంజెలో మాథ్యూస్ (20 నాటౌట్), ప్రభాత్ జయసూర్య (2 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.    38 ఓవర్లు ముగిసేసరికి లంక.. 3 వికెట్ల నష్టానికి  83 పరుగులు చేసి 65 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

కాగా భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే  లంక - కివీస్ ల టెస్టు మ్యాచ్ ఫలితం కూడా కీలకమన్న విషయం తెలిసిందే.  ఒకవేళ అహ్మదాబాద్ టెస్టులో భారత్ ఓడితే..  లంకకు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు అవకాశాలుంటాయి.   కివీస్ ను రెండు మ్యాచ్ లలో  ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే ఆ జట్టు ఫైనల్  చేరుతుంది. ప్రస్తుతం ఈ టెస్టులో లంక గెలవడం కొంచెం కష్టమే. ఈ నేపథ్యంలో మిచెల్  కివీస్ తో పాటు భారత్ ను ఆదుకున్నట్టే. ప్రస్తుత అహ్మదాబాద్ టెస్టులో భారత్ గెలుపు సంగతి దేవుడెరుగు కానీ కనీసం డ్రా చేసుకున్నా  అదే పదివేలు. 

 

PREV
click me!

Recommended Stories

ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్ నుంచి గిల్‌పై వేటుకు ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇవిగో