
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తాకింది. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ మాథ్యూ రెన్షా.. ఈ టెస్టులో కొనసాగేది అనుమానంగానే మారింది. రెండో రోజు ప్రాక్టీస్ చేస్తూ అతడు గాయపడ్డాడు. దీంతో అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు తెలిపాయి.
రెండో రోజు వార్మప్ సందర్భంగా రెన్షా.. ప్రాక్టీస్ చేస్తుండగా అతడి మోకాలికి గాయమైనట్టు సమాచారం. మోకాలికి కట్టుతో కనిపించిన అతడిని స్కానింగ్ చేసేందుకు గాను ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తున్నది. రెన్షా స్థానంలో ఆసీస్.. ఆస్టన్ అగర్ ను ఫీల్డింగ్ చేయిస్తోంది.
తొలి టెస్టుకు ముందు ఆసీస్ ప్రధాన ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ గాయంతో ఈ మ్యాచ్ కు అందుబాటులో లేడు. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను కాదని రెన్షాను తుది జట్టులోకి చోటు కల్పించింది ఆసీస్ టీమ్ మేనేజ్మెంట్. అయితే తొలి ఇన్నింగ్స్ లో రెన్షా.. పరుగులేమీ చేయకుండానే తొలి బంతికే ఎల్బీగా ఔటై పెవిలియన్ చేరాడు. లబూషేన్ ను ఔట్ చేసిన రవీంద్ర జడేజా.. తన తర్వాతి బంతికే రెన్షాను కూడా ఔట్ చేశాడు.
కాగా ఈ సిరీస్ లో ఆసీస్ కు గాయాల బెడద తప్పడం లేదు. తొలి టెస్టుకు ముందే ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లైన మిచెల్ స్టార్క్ గాయంతో తొలి టెస్టు నుంచి వైదొలిగాడు. అతడు రెండో టెస్టు (ఢిల్లీ) వరకూ టీమ్ తో కలుస్తాడు. స్టార్క్ తో పాటు ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హెజిల్వుడ్ కూడా గాయంతో నాగ్పూర్ టెస్టు ఆడటం లేదు. కామెరూన్ గ్రీన్ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు. ఇప్పుడు రెన్షాకూ గాయమవడంతో అతడు ఈ టెస్టును కొనసాగిస్తాడా..? లేదా..? అన్నది అనుమానంగానే ఉంది.