121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా... సింగిల్ డిజిట్ దాటలేకపోయిన సూర్యకుమార్ యాదవ్..10 పరుగులకే పెవిలియన్ చేరిన రిషబ్ పంత్...
క్రిస్ట్చర్చిలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 12 బంతుల తర్వాత తొలి పరుగు తీసిన శుబ్మన్ గిల్, 22 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి ఆడమ్ మిల్నే బౌలింగ్లో అవుట్ అయ్యాడు...
45 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 28 పరుగులు చేసిన కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఆడమ్ మిల్నే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఫామ్లో లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రిషబ్ పంత్, పద్ధతి మాత్రం మార్చుకోలేదు.
16 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన రిషబ్ పంత్, డార్ల్ మిచెల్ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దయిన రెండో వన్డేలో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 6 పరుగులు చేసి ఆడమ్ మిల్నే బౌలింగ్లో పెవిలియన్ చేరాడు...
59 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. లూకీ ఫర్గూసన్ బౌలింగ్లో కాన్వేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు శ్రేయాస్ అయ్యర్. వాషింగ్టన్ సుందర్తో కలిసి కాసేపు పోరాడిన దీపక్ హుడా కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 25 బంతుల్లో 12 పరుగులు చేసిన దీపక్ హుడా, టిమ్ సౌథీ బౌలింగ్లో టామ్ లాథమ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అంపైర్ నాటౌట్గా ప్రకటించినా డీఆర్ఎస్ తీసుకున్న న్యూజిలాండ్కి అనుకూలంగా ఫలితం దక్కింది. 34 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది టీమిండియా. వాషింగ్టన్ సుందర్ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ చేసే పరుగులపైనే టీమిండియా స్కోరు ఆధారపడి ఉంది.