ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి.... అనవసరపు చెత్త రికార్డును మూటగట్టుకున్న కోహ్లీ

By telugu teamFirst Published Jan 15, 2020, 7:30 AM IST
Highlights

సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్‌ ఇండియా.. ముంబయి వాంఖడెలో మాత్రం వరుసగా మూడో వన్డేలో ఓటమి చవిచూసింది. 

మ్యాచ్ ప్రారంభానికి ముందు...అభిమానులంతా వాంఖడేలో పరుగుల వరదను కళ్లారా చూడొచ్చు, హోరాహోరీ పోరు చాలా ఉత్కంఠగా సాగుతుందని అనుకున్నారు. కానీ పరుగుల వరదనయితే చూసారు...కానీ అది ఆస్ట్రేలియన్ ఓపెనర్ల బ్యాట్ల నుండి పారడం అక్కడి అభిమానులను నిరాశకు గురి చేసింది. మ్యాచ్ అంతా ఏకపక్షంగా సాగింది. 

అన్ని వెరసి వాంఖడెలో టీమ్‌ ఇండియాకు హ్యాట్రిక్‌ ఓటమిని మూటగట్టాయి.  సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్‌ ఇండియా.. ముంబయి వాంఖడెలో మాత్రం వరుసగా మూడో వన్డేలో ఓటమి చవిచూసింది. 

ఈ మ్యాచు ఓటమి వల్ల భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసిన తొలి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ మిగిలిపోయాడు. ఇంతవరకు ఎప్పుడూ కూడా భారత్ ఇలా ఓటమి చెందలేదు. 

ఆస్ట్రేలియన్ ఓపెనర్లు డెవిడ్‌ వార్నర్‌ (128 నాటౌట్‌), ఆరోన్‌ ఫించ్‌ (110 నాటౌట్‌)లు అజేయ సెంచరీలతో చెలరేగారు. డెవిడ్‌ వార్నర్‌, అరోన్‌ ఫించ్‌ మెరుపులతో 256 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలోనే ఊదేసింది. ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

Also read: లోయర్ మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ బ్యాచ్ చెత్త ప్రయోగాలు...

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 255 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (74), వన్ డౌన్ బ్యాట్స్ మెన్ కెఎల్ రాహుల్‌ (47) రాణించారు. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యం సాధించింది. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఎల్లుండి శుక్రవారం నాడు రాజ్‌కోట్‌లో జరుగనుంది. 

భారత మంత్రం...భారత్ పైన్నే ప్రయోగం  

భారీ లక్ష్యాలను టాప్‌ ఆర్డర్‌ మెరుపులతోనే ఊదేసిన రికార్డు భారత్‌ సొంతం. తొలిసారి భారత్‌కు ఆ చేదు అనుభవం రుచి చూపించింది ఆసీస్‌. ఫ్లాట్‌ వికెట్‌పై డెవిడ్‌ వార్నర్‌ (128), అరోన్‌ ఫించ్‌ (110) అద్భుత శతకాలు నమోదు చేశారు. డెవిడ్‌ వార్నర్‌ ఓ సారి క్యాచ్‌, మరోసారి ఎల్బీగా అవుటైనా.. రివ్యూలు తీసుకొని ఇన్నింగ్స్‌ ను కొనసాగించాడు. 

తొలుత కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ నెమ్మదిగా ఆడాడు. విధ్వంసక ఓపెనర్‌ వార్నర్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్స్‌తో ఫించ్‌ 52 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ అందుకున్నాడు. 

పవర్‌ప్లేలో 84 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గెలుపు బాటలో నిలిపిన ఓపెనర్లు అదే జోరుతో కుమ్మేశారు. డజను ఫోర్లు, మూడు సిక్సర్లతో 88 బంతుల్లో వార్నర్‌ సెంచరీ బాదగా, ఫించ్‌ 108 బంతుల్లో శతకం సాధించాడు. 

Also read: సిక్స్ కొట్టిన విరాట్ కోహ్లీకి ఆడమ్ జంపా రిటర్న్ గిఫ్ట్

2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా తొలిసారి వన్డే మ్యాచును వాంఖడెలోనే ఆడింది. అగ్ర జట్టు భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఆసీస్ పేస్ త్రయం... బ్యాట్స్ మెన్ దాసోహం 

ఫ్లాట్‌ వికెట్‌పై ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (10)ను త్వరగా కోల్పోయిన భారత్‌ను శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. 134/1తో భారీ స్కోరు దిశగా సాగిన భారత్‌ ను ఒక్కసారిగా కుదేలయ్యేలా చేసారు కంగారు బౌలర్లు.  

ఆసీస్‌ బౌలర్ల ధాటికి 134/1 నుంచి ఒక్కసారిగా 164/5 కు పడిపోయిని టీం ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. విరాట్‌ కోహ్లి (16), శ్రేయస్ అయ్యర్‌ (4) విఫలమయ్యారు. రిషబ్‌ పంత్‌ (28), రవీంద్ర జడేజా (25), కుల్దీప్‌ యాదవ్‌ (17) ల వల్ల భారత్‌కు గౌరవప్రదమైన స్కోరైనా దక్కింది. 

స్టార్క్‌ విసిరిన బంతి తలకు బలంగా తగలటంతో రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌కు రాలేదు. కెఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు చూసుకున్నాడు.

ఫ్లాట్‌ వికెట్‌పై వైవిధ్యం చూపించిన ఆసీస్‌ బౌలర్లు భారత్‌ను కట్టడి చేశారు. మిచెల్‌ స్టార్క్‌, కమిన్స్‌, రిచర్డ్‌సన్‌ లు దుమ్ము దులిపారు. ఫ్లాట్ వికెట్ పై కూడా ఎక్సట్రా బౌన్స్, పేస్, సీమ్ సాధించారు. ఆ పిచ్ పై సీమర్లకు స్పిన్నర్లు ఆగర్‌, జంపాలు కూడా తోడయి వారు సైతం చెరో వికెట్ సాధించి భారత పతనానికి తమ వంతు పాత్ర పోషించారు. 

click me!