ముగిసిన రెండో రోజు ఆట... ఆస్ట్రేలియా కౌంటర్ అటాక్! దూకుడుగా ఆడుతూ టీమిండియాపై...

Published : Feb 18, 2023, 05:14 PM ISTUpdated : Feb 18, 2023, 05:17 PM IST
ముగిసిన రెండో రోజు ఆట... ఆస్ట్రేలియా కౌంటర్ అటాక్! దూకుడుగా ఆడుతూ టీమిండియాపై...

సారాంశం

రెండో రోజు ఆట ముగిసే సమయానికి  61 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... ఆసీస్‌కి 62 పరుగుల ఆధిక్యం... మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయనున్న మూడో రోజు ఆట.. 

తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన ఆస్ట్రేలియా జట్టు, ఢిల్లీ టెస్టులో కౌంటర్ అటాక్ చేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 1 పరుగు ఆధిక్యం మాత్రమే దక్కినా రెండో ఇన్నింగ్స్‌లో దూకుడు మంత్రంతో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతోంది..  డేవిడ్ వార్నర్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఉస్మాన్ ఖవాజాతో కలిసి ట్రావిస్ హెడ్ ఓపెనింగ్‌కి వచ్చాడు. 13 బంతుల్లో 6 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ కలిసి భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగారు. ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసి వన్డే స్టైల్‌లో ఆడుతుంటే నెం.1 టెస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్ 19 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి అతనికి సహాకారం అందిస్తున్నారు..

ఈ ఇద్దరి కారణంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ‘బజ్ బాల్’ కాన్సెప్ట్‌తో బౌండరీలు బాదుతూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది ఆస్ట్రేలియా. ఇదే స్పీడ్‌తో మూడో రోజు తొలి సెషన్‌లో బ్యాటింగ్ చేసినా టీమిండియా ముందు కొండంత లక్ష్యం పెట్టేస్తుంది ఆసీస్. మూడో తొలి సెషన్‌లో టీమిండియా ఎంత త్వరగా ఆస్ట్రేలియాని ఆలౌట్ చేస్తుందనేదానిపైనే మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది..

గత 36 ఏళ్లలో ఢిల్లీలో టీమిండియా ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు. ఆ రికార్డును పదిలంగా కాపాడుకోవాలంటే మూడో రోజు ఆటే కీలకం. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకి ఆలౌట్ కాగా టీమిండియా 262 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కి 1 పరుగు ఆధిక్యం దక్కింది.

ఓవర్‌నైట్ స్కోరు 21/0 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి నాథన్ లియాన్ ఊహించని షాక్ ఇచ్చాడు. 41 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన నాథన్ లియాన్, ఆ తర్వాత వెంటవెంటనే 3 వికెట్లు తీశాడు..

69 బంతుల్లో 2 ఫోర్లతో 32 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికి పూజారా వికెట్ కోల్పోయింది భారత జట్టు. 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా, 7 బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 

15 బంతుల్లో 4 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోంబ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 46/0 స్కోరుతో ఉన్న టీమిండియా, వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయి 66/4 స్థితికి చేరుకుంది.. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

74 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 84 బంతుల్లో 4 ఫోర్లతో 44 పరుగులు చేసి మాథ్యూ కుహ్నేమాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.. టీవీ రిప్లైలో బంతి విరాట్ కోహ్లీ బ్యాటుకి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో వివాదం రేగింది.

12 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కలిసి ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో రంషో పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. దీంతో 114 పరుగుల 8వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది...

115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసిన అక్షర్ పటేల్, టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్ గాల్లోకి ఎగురుతూ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. 2 పరుగులు చేసిన షమీని కుహ్నేమన్‌ క్లీన్ బౌల్డ్ చేయడంతో 262 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది.

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !