
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా సత్తా చాటింది. ఐదు టీ20ల సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. మౌంట్ మాంగనూయ్లో జరిగిన ఆఖరి టీ20లో కివీస్పై భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత బౌలర్ల ముందు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ నిలబడలేకపోయారు.
భారత్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా బౌలింగ్లో ఓపెనర్ గప్టిల్ 2 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ కొద్దిసేపటికే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మరో ఓపెనర్ మన్రో 15 క్లీన్ బౌల్డయ్యాడు.
ఈ షాక్ నుంచి తేరుకునేలోపు నవ్దీప్ షైనీ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతిని డిఫెండ్ చేసిన సీఫెర్ట్ పరుగు కోసం ప్రయత్నించగా.. అవతలి ఎండ్లో ఉన్న బ్రూస్ 0 రనౌట్ అవ్వడంతో కివీస్ కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత సిఫేర్ట్ , రాస్ టేలర్ను ఇన్నింగ్స్ను నిర్మించారు. సిక్సర్లు, ఫోర్లతో ధాటిగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు.
Also Read:పంత్ ను అలాగే చేస్తారా: ధోనీపై నిప్పులు చెరిగిన సెహ్వాగ్
ఈ క్రమంలో ఇద్దరూ అర్థసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నవ్దీప్ షైనీ విడదీశాడు. 12.4వ బంతికి 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టిమ్ సీఫెర్ట్.. సంజు శాంసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో రాస్ టేలర్ ఉండటంతో కివీస్ జట్టు విజయంపై ఆశలు పెట్టుకుంది.
అయితే డారేల్ మిచెల్ 2, మిచెల్ శాంట్నర్, కుగ్లీన్ 0 వరుసగా పెవిలియన్ చేయడంతో న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. ఇదే సమయంలో 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నవదీప్ షైనీ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి రాస్ టేలర్ ఔటవ్వడంతో కివీస్ ఓటమి ఖరారైంది.
Also Read:హార్దిక్ పాండ్యాకు షాక్: కివీస్ పై టెస్టు జట్టులో నో చాన్స్
అయితే చివరిలో ఐష్ సోదీ, బెన్నెట్ పోరాటం చేశారు. ముఖ్యంగా సోదీ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో మళ్లీ సూపర్ఓవర్ ఆడాల్సి వస్తుందని భావించారు. శార్థూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటకట్టుకుంది. భారత బౌలర్లలో బుమ్రా 3, నవదీప్ షైనీ, శార్థూల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ శాంతసన్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుగులీన్ బౌలింగ్లో శాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Also Read:నాకు ఇంకో చాయిస్ లేదు: నెంబర్ 6పై మనీష్ పాండే
అనంతరం వన్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ శర్మ 60, కేఎల్ రాహుల్ 45తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. వీరిద్దరూ చూడచక్కని షాట్లతో కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను 12వ ఓవర్లో బెన్నెట్ బౌలింగ్లో శాంట్నర్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవలియన్ చేరాడు.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్తో కలిసి ధాటిగా ఆడిన రోహిత్ శర్మ కాలికి గాయం కావడంతో అతను రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే 5 కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు.
చివర్లో మనీశ్ పాండేతో కలిసి శ్రేయస్ అయ్యర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఓవర్లు అయిపోయాయి. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో కుగేలిన్ 2, బెన్నెట్ ఒక వికెట్ పడగొట్టారు.