
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటి హైప్రెషర్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ మరోసారి తన క్లాస్ను చూపించింది. జట్టుకు అవసరమైన సమయంలో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ వ్యక్తిగతంగా కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉండగా, హర్మన్ప్రీత్ తాజాగా ఆ రికార్డును దాటేసింది. దీంతో భారత మహిళల క్రికెట్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టైంది.
మ్యాచ్ సమయంలో 16 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 36 పరుగులతో క్రీజులో నిలిచి జట్టును ముందుకు నడిపించింది. ఆమె ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు ఉన్నాయి.
మరో ఎండ్లో రిచా ఘోష్ వేగంగా ఆడుతూ 4 బంతుల్లో 7 పరుగులతో నిలిచింది. మధ్య ఓవర్లలో వికెట్లు పడినప్పటికీ హర్మన్ప్రీత్ ఇన్నింగ్స్ను చక్కగా నిర్మిస్తూ స్కోరును వేగంగా పెంచింది. ప్రస్తుతం భారత్ భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది.
భారత మహిళల క్రికెట్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో మిథాలీ రాజ్ పాత్ర ఎంత గొప్పదో తెలిసిందే. ఇప్పుడు ఆ వారసత్వాన్ని హర్మన్ప్రీత్ కౌర్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్లో భారత జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తున్న ఆమె, ఎన్నో కీలక మ్యాచ్ల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసింది. టీ20 ప్రపంచకప్ వంటి మ్యాచ్ లో మిథాలీ రికార్డును అధిగమించడం హర్మన్ప్రీత్ కెరీర్లో ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోనుంది.
హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత జట్టు గతంతో పోలిస్తే మరింత దూకుడుగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞుల సమన్వయంతో బలమైన జట్టుగా మారింది. ఇలాంటి కీలక టోర్నీలో కెప్టెన్ ఫామ్లో ఉండటం భారత్కు పెద్ద బలం.
మిథాలీ రాజ్ రికార్డును అధిగమించిన హర్మన్ప్రీత్, ఇదే జోరు కొనసాగిస్తే భారత మహిళల జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్ ట్రోఫీ అందించగలదనే ఆశాభావం అభిమానుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె బ్యాట్ నుంచి వస్తున్న పరుగులు జట్టుకు మాత్రమే కాదు, భారత మహిళల క్రికెట్ భవిష్యత్తుకు కూడా కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి.