
తొలి టీ20 మ్యాచ్లో పెద్దగా పోరాటం చూపించకుండానే చేతులు ఎత్తేసిన శ్రీలంక జట్టు, రెండో మ్యాచ్లో బ్యాటింగ్లో రాణించి, టీమిండియా ముందు అదిరిపోయే స్కోరు పెట్టగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. లంకకి ఓపెనర్లు దనుష్క గుణతిలక, పథుమ్ నిస్సంక కలిసి శుభారంభం అందించారు...
తొలి వికెట్కి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత దనుష్క గుణతిలక వికెట్ కోల్పోయింది శ్రీలంక. 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన దనుష్క గుణతిలక, రవీంద్ర జడేజా బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి వెంకటేశ్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
ఆ తర్వాత చరిత్ అసలంక 5 బంతుల్లో 2 పరుగులు చేసి యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా కమిల్ మిశార 4 బంతుల్లో ఒకే పరుగు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
తొలి టీ20 మ్యాచ్లో క్యాచులు డ్రాప్ చేసిన శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, నేటి మ్యాచ్లో కళ్లు చెదిరే క్యాచులు అందుకోవడం విశేషం.. 10 బంతుల్లో ఓ ఫోర్తో 9 పరుగులు చేసిన వికెట్ కీపర్ దినేశ్ చండీమల్... బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు....
చండీమల్ క్యాచ్తో టీ20ల్లో 50 క్యాచులు అందుకున్న మొట్టమొదటి భారత ఫీల్డర్గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ 43 క్యాచులతో రెండో స్థానంలో ఉండగా, సురేష్ రైనా టీ20ల్లో 42 క్యాచులు అందుకున్నాడు...
102 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్ పథుమ్ నిస్సంక, కెప్టెన్ దసున్ శనక కలిసి ఐదో వికెట్కి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 53 బంతుల్లో 11 ఫోర్లతో 75 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన పథుమ్ నిస్సంక, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత శ్రీలంక కెప్టెన్ దసున్ శనక 19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 47 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి లంకకి భారీ స్కోరు అందించాడు. ఆఖర్లో టీమిండియా స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ బౌలింగ్లోనూ శనక వీర బాదుడు బాదడంతో ఆఖరి 5 ఓవర్లలో లంకకి 80 పరుగులు రాగా, చివరి 4 ఓవర్లలో 72 పరుగులు రావడం విశేషం...
భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహాల్, హర్షల్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు. తొలి టీ20 మ్యాచ్లో దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్ వంటి పార్ట్ టైం బౌలర్లకు అవకాశం ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, రెండో టీ20లో వారికి బాల్ అందివ్వకపోవడం విశేషం...