T20 WC 2024: భారత్ vs ఇంగ్లండ్..గయానాలో సెమీ ఫైన‌ల్ పోరు.. ఎవరిది పైచేయి?

By Mahesh RajamoniFirst Published Jun 26, 2024, 4:01 PM IST
Highlights

IND vs ENG Semi-Final T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్న‌ది. ట్రోఫీని అందుకోవడానికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్న టీమిండియా ఇప్పుడు సెమీ ఫైన‌ల్లో జూన్ 27న గయానాలో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
 

IND vs ENG Semi-Final T20 World Cup 2024 : అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో టీ20  ప్రపంచ కప్‌లో భారత జట్టు త‌న జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్న‌ది. ఐసీసీ ట్రోఫీకి కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. జూన్ 24న ఆస్ట్రేలియాను చిత్తుచేసిన త‌ర్వాత టీమ్ ఇండియాకు సెమీఫైనల్ టిక్కెట్ దక్కింది. ఇప్పుడు ఈ రౌండ్‌లో భారత్ జూన్ 27న గయానాలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. భారత జట్టు ఇప్పటి వరకు ఇక్కడ 3 టీ20 మ్యాచ్‌లు ఆడింది. గ‌త మ్యాచ్ ల‌ను గ‌మ‌నిస్తే ఇక్క‌డ ఇండియాకు అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి.

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఓట‌మి లేకుండా ఆరు విజయాలు సాధించింది. గ్రూప్ దశలో భారత జట్టు 3 మ్యాచ్‌లు గెలిచి సూపర్-8కి చేరుకుంది. దీని తర్వాత, సూప‌ర్-8లో రోహిత్ సేన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లను చిత్తుగా ఓడించింది. ఇప్పుడు రోహిత్ శర్మ జట్టు సెమీ-ఫైనల్, ఫైనల్స్‌లో కూడా విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తోంది. అంతకు ముందు గయానా వేదికగా జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌కు భారత జట్టు  గ‌త రికార్డులు గ‌మ‌నిస్తే..

Latest Videos

గయానాలో టీమిండియా గ‌త రికార్డులు ఎలా ఉన్నాయి? 

గ‌యానాలోని క్రికెట్ స్టేడియంలో ఇండియా మొత్తం 3 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో భారత జట్టు 2 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో మెన్ ఇన్ బ్లూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2019లో ఇదే మైదానంలో భారత జట్టు తొలి టీ20 మ్యాచ్‌ ఆడి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గతేడాది వెస్టిండీస్‌ పర్యటనలో భారత్‌ రెండు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించగా, తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. 

ఇంగ్లండ్ ప‌రిస్థితి ఏంటి? 

ఇంగ్లండ్ జట్టుకు ఈ మైదానం మంచి ట్రాక్ రికార్డు అయితే లేదు. ఇప్పటి వరకు ఇక్కడ ఇంగ్లండ్‌ ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడగా, ఆ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2024లో కూడా ఇంగ్లిష్ జట్టు తడబడి సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే సెమీఫైనల్‌లో గత ప్రపంచకప్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు పూర్తి మాస్టర్ ప్లాన్‌తో కూర్చుంటుంది. అయితే వర్షం ఈ మ్యాచ్‌ని చెడగొట్టే అవకాశం ఉందన్న భయం నెలకొంది.

ఫైనల్ వెళ్లేది ఎవ‌రు? 

టీమిండియాకు ఫైనల్ టిక్కెట్ కన్ఫర్మ్ అయినట్లే. ఎందుకంటే జూన్ 27న గయానాలో దాదాపు 89 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ప్రపంచ కప్‌లో మొదటి సెమీ-ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంచబడింది, కానీ రెండవ మ్యాచ్ కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 27న భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయితే.. టీమ్ ఇండియా నేరుగా ఫైనల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. మ్యాచ్ జ‌రిగినా ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ ఓట‌మి లేకుండా ముందుకు సాగుతోంది కాబ‌ట్టి విజ‌యావ‌కాశాలు భార‌త్ కే ఉన్నాయి.

 

click me!