
న్యూఢిల్లీ: ఆసియా కప్, వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ల వేదికపై కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్నది. క్రికెట్ అభిమాన లోకంలోనూ ఈ వేదికంలపై గందరగోళం ఉన్నది. హైబ్రిడ్ ఫార్మాట్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ల మధ్య సయోధ్య కుదిరిన తర్వాత ఈ వ్యవహారానికి పాకిస్తాన్ క్రీడా శాఖ మంత్రి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఏషియాకప్ మ్యాచ్ ఒక తటస్థ వేదికపై ఆడతామని బీసీసీఐ పట్టుబడితే బాబార్ ఆజామ్ సారథ్యంలోని క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ కోసం భారత్ పర్యటించబోదని స్పోర్ట్స్ మినిస్టర్ ఎహెసాన్ మజారీ ఇండియన్ ఎక్స్ప్రెస్కు తెలిపారు.
‘పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నేను బాధ్యత వహిస్తున్న క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తుంది. వరల్డ్ కప్ వేదికపై నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే.. ఒక వేళ ఇండియా వారి ఆసియా కప్ మ్యాచ్లు తటస్థ వేదికపైనే ఆడుతామని డిమాండ్ చేస్తే మేము కూడా వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం ఇలాంటి డిమాండే చేస్తాం’ అని అన్నారు. బీసీసీఐ ఆసియా కప్ మ్యాచ్లకు తటస్థ వేదికకు ప్రణాళికలు వేస్తే మాత్రం పాకిస్తాన్ కూడా వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం భారత దేశంలో పర్యటించబోదని స్పష్టం చేశారు.
వరల్డ్ కప్లో పాల్గొనే అంశంపై తేల్చడానికి పాకిస్తాన్ ప్రధాని షెహెబాజ్ షరీఫ్ ఓ కమిటీ వేశారు.
‘ఈ కమిటీ విదేశాంగ మంత్రి బిలావాల్ భుట్టో జర్దారీ సారథ్యంలో చర్చిస్తుంది. ఆ 11 మంత్రుల్లో నేను కూడా ఉన్నాను. మేం చర్చించి ప్రధానమంత్రికి సిఫార్సులు చేస్తాం. తుది నిర్ణయం ప్రధాని తీసుకుంటారు’ అని చెప్పారు.
పాకిస్తాన్లో ఆడటానికి ఇండియా వెనుకాడటంపై ఆ దేశ మంత్రి విచారం వ్యక్తం చేశారు. ‘క్రికెట్ను భారత్ రాజకీయాల్లోకి తీసుకువస్తున్నది. భారత ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ టీమ్ను పాకిస్తాన్కు పంపడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నదో నాకు అర్థం కావడం లేదు. కొద్ది కాలం క్రితమే ఓ భారీ బేస్ బాల్ కాంటింజెంట్ ఇండియా నుంచి వచ్చి ఇస్లామాబాద్లో ఆడింది. ఓ బ్రిడ్జ్ టీమ్ కూడా పాకిస్తాన్కు వచ్చింది. వారు సుమారు 60 మందికి పైనే ఉన్నారు. నేను వారి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వెళ్లాను. వారు ఇక్కడ కప్ గెలుచుకుని తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు. పాకిస్తాన్ నుంచి ఫుట్ బాల్, హాకీ, చెస్ టీమ్లు కూడా ఇండియాకు పర్యటించాయి’ అని పాక్ మినిస్టర్ అన్నారు.
బీసీసీఐ చెబుతున్న భద్రతాపరమైన అంశాలనూ ప్రస్తావిస్తూ.. ఇతర దేశాలు జట్టులు పాకిస్తాన్ పర్యటిస్తున్నాయని సమాధానం ఇచ్చారు. ‘న్యూజిలాండ్ టీమ్ ఇక్కడికి వచ్చింది. అంతకు ముందు ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కూడా పాకిస్తాన్లో ఆడింది. వారికి ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ ఇచ్చాం. అంతకు ముందు టీమిండియా క్రికెట్ జట్టుకు ఇక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. భద్రత అనేది ఒక సాకు మాత్రమే. మేం పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా నిర్వహించాం. అందులో ఎందరో మంది విదేశీ ఆటగాళ్లు ఆడారు’ అని వివరించారు.