
బీపీఎల్ 2023 సీజన్ తుది దశకు చేరుకుంది. ఈ లీగ్ లో ఇప్పటివరకు ఆట, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల కంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితం పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా.. ఓ క్రికెటర్ ను బాడీ షేమింగ్ చేసి అబాసుపాలయ్యాడు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ సారథి, ప్రస్తుతం బీపీఎల్ లో ఖుల్నా టైగర్స్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఖలీద్ మహ్మద్.. మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్ లో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు.
బీపీఎల్ లీగ్ దశ మ్యాచ్ లలో భాగంగా ఫిబ్రవరి 10న ఖుల్నా టైగర్స్ - ఫార్ట్యూన్ బరిషాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఖుల్నా టైగర్స్ హెడ్ కోచ్ గా ఉన్న ఖలీద్.. డగౌట్ లో మ్యాచ్ చూస్తూ సిగరెట్ తాగాడు. డగౌట్ లో ప్లేయర్లందరూ చూస్తుండగానే ఈ పనిచేశాడు.
నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు సిగరెట్, మధ్యం సేవించడం నిషేధం. అయితే ఈ నిబంధనలను అతిక్రమిస్తూ సిగరెట్ తాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘యూరప్ లో ఇలా చేసినందుకు ప్లేయర్లు నిషేధానికి గురవుతారు. అసలు డ్రెస్సింగ్ రూమ్ లో ఖలీద్ మహ్మద్ సిగరెట్ తాగాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు..’అని కామెంట్ చేశాడు. మరో అభిమాని.. ‘ఖలీద్ మహ్మద్ ఫీల్డ్ లో సిగరెట్ తాగుతూ తన ప్లేయర్లకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఖలీద్ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఏం చర్యలు తీసుకుంటుందని ఆసక్తికరంగా మారింది.
ఖలీద్ మహ్మద్.. బంగ్లాదేశ్ తొలి తరం క్రికెటర్. బంగ్లా తరఫున అతడు 77 వన్డేలు, 12 టెస్టులు కూడా ఆడాడు. ఆ జట్టుకు కొన్నాళ్లు సారథిగా కూడా వ్యవహరించాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక అతడు కొన్నాళ్ల పాటు బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ టీమ్ కు టెక్నికల్ డైరక్టర్ గా, అసిస్టెంట్ కోచ్ గా సేవలందించాడు.