
అటు ఆఫ్రికన్ అభిమానులతో పాటు భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ ను కూడా విశేషంగా అలరిస్తున్న సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (ఎస్ఎ 20) లో ఊహించని మలుపు. లీగ్ దశ నుంచి సజావుగా సాగుతున్న ఈ మినీ ఐపీఎల్ లో షెడ్యూల్ ప్రకారం శనివారం (ఫిబ్రవరి 11) ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ శనివారం ఫైనల్ జరగాల్సి ఉన్న జోహన్నస్బర్గ్ లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ మ్యాచ్ వాయిదా పడింది.
వర్షంతో పాటు వాతావరణం కూడా మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేదు. దీంతో మ్యాచ్ ను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్టు ఎస్ఎ 20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ తెలిపాడు. ఫైనల్ కు రిజర్వ్ డే ఉన్నందున మ్యాచ్ ను వాయిదా వేసినట్టు చెప్పాడు.
ఫైనల్ పోరుకు సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ (హైదరాబాద్ టీమ్) , ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ టీమ్) అర్హత సాధించిన విషయం తెలిసిందే. తొలి సెమీస్ లో ప్రిటోరియా.. పార్ల్ రాయల్స్ (రాజస్తాన్ టీమ్) ను ఓడించిన విషయం తెలిసిందే. ఇక రెండో సెమీస్ లో సన్ రైజర్స్.. జోబర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై టీమ్) ను మట్టికరిపించి ఫైనల్ కు చేరింది.
కాగా నేటి మ్యాచ్ కు వాతావరణ శాఖ ముందస్తు సమాచారం తీసుకున్నామని, ఆదివారం వర్షం కురిసే అవకాశాలు లేవని గ్రేమ్ స్మిత్ తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మొదలవుతుందని స్మిత్ ప్రకటించాడు.