T20Worldcup: మేము సెక్యూరిటీని పంపించడం మర్చిపోయాం.. యూఏఈలో మీరు సేఫే కదా..? కివీస్ పై అక్తర్ సెటైర్స్

By team teluguFirst Published Oct 27, 2021, 3:56 PM IST
Highlights

Shoaib Akhtar:న్యూజిలాండ్ పై విజయానంతరం పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కివీస్ జట్టుపై సెటైర్లు వేశాడు.  ‘మీరిక్కడ భద్రంగానే ఉన్నారా..?’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు.

అంచనాల్లేకుండా ఐసీసీ టీ20  ప్రపంచకప్ (ICC T20 Worldcup2021) లోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్థాన్ (Pakistan)..  వరుస విజయాలతో అందరికీ షాకిస్తున్నది. ఇప్పుడు గ్రూప్-2 లో ఏకంగా నెంబర్ వన్ స్థానంతో దాదాపు సెమీఫైనల్ బెర్తు కూడా ఖరారు చేసుకుంది. తమదైన రోజున ఎవర్నైనా ఓడిస్తారనే గుర్తింపు ఉన్న పాక్.. అందుకు తగ్గట్లు  ప్రదర్శనే చేస్తున్నది. ఆదివారం రాత్రి చిరకాల ప్రత్యర్థి భారత్ (India)ను చిత్తు చేసిన పాకిస్థాన్.. నిన్న జరిగిన మ్యాచ్ లో కొత్త ప్రత్యర్థి న్యూజిలాండ్ (newzealand)పై  ప్రతీకారం తీర్చుకుంది. 

ఇదిలాఉండగా.. న్యూజిలాండ్ పై విజయానంతరం పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కివీస్ జట్టుపై సెటైర్లు వేశాడు.  ‘మీరిక్కడ భద్రంగానే ఉన్నారా..?’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. సుమారు 18 ఏండ్ల  తర్వాత గత నెలలో పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. అర్థాంతరంగా సిరీస్ రద్దు చేసుకుని వెళ్లిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశం సిరీస్ ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇప్పుడిదే విషయాన్ని ఎత్తి చూపుతూ  అక్తర్ విమర్శలు సంధించాడు. 

 

పాకిస్థాన్-న్యూజిలాండ్ (Pakistan vs Newzealand) మ్యాచ్ అనంతరం అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో స్పందిస్తూ.. ‘పాకిస్థాన్ కు రానందుకు న్యూజిలాండ్ కు కృతజ్ఞతలు. కానీ మీరు యూఏఈలో భద్రంగానే ఉన్నారు కదా..? మీరు మైదానంలో కూడా సురక్షితంగా ఉండరని మేము భావించినందున మేము ఫీల్డ్ లో సెక్యూరిటీని పంపడం మర్చిపోయాం’ అంటూ సెటైర్లు వేశాడు. 

క్రికెట్ ఆడేందుకు పాక్ సురక్షిత దేశం.. 

అనంతరం అక్తర్ మాట్లాడుతూ.. క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్ చాలా సురక్షితమైన దేశమని స్పష్టం చేశాడు. తమ దేశంలో ఆటగాళ్లకు భద్రతా ఏర్పాట్లు అత్యున్నతంగా ఉన్నాయని స్పష్టం చేశాడు. టీ20 టోర్నీలో పాక్ ను ఏ జట్టూ తేలికగా తీసుకోదని చెప్పాడు. అంతేగాక.. వచ్చేనెలలో జరిగే టీ20 ఫైనల్స్ కు భారత్ అర్హత సాధిస్తుందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ లో భారత్ ను ఢీకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నాడు. 

click me!