Virender Sehwag: భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ‘వీరూగిరి’లో వీరూ.. టీ20 మ్యాచ్ లకు సంబంధించిన విశ్లేషణలు చేస్తున్నాడు.
ఈనెల 17న మొదలైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) సూపర్-12 దశకు చేరింది. ఇప్పటికే పలు జట్లు తమ అద్భుత ప్రదర్శనలతో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి సిద్ధమవుతుండగా.. ఫేవరేట్లుగా బరిలోకి దిగిన జట్లు ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ (West indies) ఇప్పటికే రెండు ఓటములతో సెమీస్ స్థానాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంది. ఇక గ్రూప్-1 లోనే ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh) కూడా రెండు మ్యాచ్ లు ఓడింది.
మరోవైపు గ్రూప్-2 లో అంచనాల్లేకుండా వచ్చిన పాకిస్థాన్ (Pakistan).. ఆదివారం రాత్రి చిరకాల ప్రత్యర్థి టీమిండియా (Team India) ను ఓడించింది. నిన్న రాత్రి న్యూజిలాండ్ (Newzealand) ను కూడా మట్టికరిపించింది. భారత్ ఖాతా కూడా తెరవలేదు. అఫ్ఘనిస్థాన్ (afghanistan) తొలి మ్యాచ్ లో భారీ తేడాతో గెలిచింది. దీంతో ఏ జట్టు సెమీస్ కు వెళ్తుంది..? ఫైనల్ కు వెళ్లే జట్టు ఏది.? అని క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు.
ఇదే విషయమై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ‘వీరూగిరి’లో వీరూ.. టీ20 మ్యాచ్ లకు సంబంధించిన విశ్లేషణలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ నెటిజన్.. అసలు యూఏఈ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఎవరు గెలుస్తారు..? అని ప్రశ్న వేశాడు.
ఈ ప్రశ్నకు సెహ్వాగ్ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. వీరూ స్పందిస్తూ.. ‘నా దృష్టిలో ఇప్పటికీ టీమిండియానే ఫేవరేట్. ఈసారి భారత్ కచ్చితంగా ప్రపంచకప్ నెగ్గుతుంది. పాకిస్థాన్ తో ఓడిపోయినంత మాత్రానా మనం నష్టపోయిందేం లేదు. ఇక తర్వాత నుంచి భారత్ తన అత్యుత్తమ ఆటతీరును చూపిస్తుంది’ అని అన్నాడు.
జట్టు గెలిచినప్పటికంటే ఓడినప్పుడే ఆటగాళ్లకు మద్దుతునివ్వాలని సెహ్వాగ్ అన్నాడు. ‘మ్యాచ్ గెలిచినప్పుడు కంటే ఓడినప్పుడు మద్దతు ఇస్తే అది జట్టుకు బూస్టప్ అవుతుంది. టీమిండియా విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది’ అని చెప్పాడు. కాగా.. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో ఓడిపోయిన భారత్.. వచ్చే ఆదివారం న్యూజిలాండ్ తో కీలక పోరులో తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. మరి ఈ మ్యాచ్ లో విరాట్ సేన ఏ విధంగా ఆడుతుందో చూడాలి.