కరోనా కోసం మ్యాచ్‌లు ఆడదామన్న అక్తర్: ఇండియా వద్ద బోల్డంత డబ్బుందన్న కపిల్

By Siva KodatiFirst Published Apr 9, 2020, 5:40 PM IST
Highlights

భారతదేశంతో పాటు పాకిస్తాన్‌లోనూ కోవిడ్ 19 విలయతాండవం చేస్తుండటంతో బాధితులకు సాయం చేసేందుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఓ సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు గాను ప్రపంచంలోని వైద్య సిబ్బంది తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఇతర యంత్రాంగానికి ఈ విపత్కర సమయంలో పలువురు ప్రముఖులు సైతం తోడుగా నిలుస్తున్నారు.

భారతదేశంతో పాటు పాకిస్తాన్‌లోనూ కోవిడ్ 19 విలయతాండవం చేస్తుండటంతో బాధితులకు సాయం చేసేందుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఓ సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

దాయాది దేశాలు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడితే బాగుంటుందని, తద్వారా వచ్చే విరాళాలు ఇరు దేశాలు కరోనాపై చేస్తున్న పోరాటంలో ఉపయోగపడతాయని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

Also Read;చిన్న తప్పుకు నరకం అనుభవించా: డోపింగ్ టెస్టులో పట్టుబడటంపై పృథ్వీషా ఆవేదన

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకుండా, కేవలం టీవీలకు మాత్రమే పరిమితం చేయాలని పేర్కొన్నాడు. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ప్రస్తుత క్లిష్ట పరిస్ధితుల్లో క్రికెటర్లతో రిస్క్ చేయాల్సిన అవసరం లేదని అక్తర్‌కు చురకలంటించాడు. భారత్-పాకిస్తాన్‌ల మధ్య సిరీస్ జరగాలని కోరడం అక్తర్ అభిప్రాయమని.. కానీ ఇక్కడ ఓ విషయాన్ని అతను గుర్తుంచుకోవాలని కపిల్ అన్నాడు.

కరోనా కట్టడి కోసం భారత్  విరాళాలు కోసం ఇలా సిరీస్‌లు ఆడాల్సిన అవసరం లేదని కపిల్‌దేవ్ అన్నాడు. తమ దగ్గర సరిపడా డబ్బుందని.. ప్రస్తుత పరిస్ధితుల్లో సంక్షోభం నుంచి గట్టెక్కడం కావాలని చెప్పాడు.

ఇప్పటికే కరోనాపై పోరాటంలో భాగంగా ప్రభుత్వానికి బీసీసీఐ రూ.51 కోట్లు విరాళంగా ఇచ్చిందని.. ఇంకా అవసరమైతే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కపిల్‌ అభిప్రాయపడ్డాడు..

తాను చెప్పేది ఏంటంటే, ఈ పరిస్థితుల్లో టీమిండియా క్రికెటర్లు నిధుల కోసం మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదని.. అసలు క్రికెటర్లతో రిస్క్ ఎలా చేస్తామని వ్యాఖ్యానించాడు. మూడు మ్యాచ్‌లతో ఎంత నగదును సంపాదిస్తామన్న ఆయన.. తనకు తెలిసినంత వరకు ఐదు, ఆరు నెలల పాటు క్రికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదన్నాడు.

Also Read:వాళ్ల వీడియోకి రవిశాస్త్రి ట్రేసర్ బులెట్ ఆడియో.. నెట్టింట వైరల్

ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ప్రజల ప్రాణాలను కాపాడటంపైనే దృష్టి పెట్టాలని.. ఇదే సమయంలో పేద వారి ఆకలి బాధను తీర్చాల్సిన అవసరం కూడా ఉందని కపిల్ దేవ్ చెప్పాడు.

కరోనా వైరస్‌పై ఎవరూ రాజకీయాలు చేయొద్దని.. తాను ఇప్పటికే టీవీల్లో చూశానని అన్నాడు. వైరస్ నియంత్రణలో కూడా రాజకీయ కోణాలు కనపిస్తున్నాయని.. ఇది సరైనది కాదని ఈ హర్యానా హారికేన్ మండిపడ్డాడు. 

click me!