టీ 20 వరల్డ్‌కప్‌పై ఐసీసీ ప్రకటన: విదేశాల్లో ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ పావులు, కేంద్రానికి లేఖ

By Siva KodatiFirst Published Jul 21, 2020, 7:07 PM IST
Highlights

ఆస్ట్రేలియా వేదిక త్వరలో జరగాల్సిన టీ 20 ప్రపంచకప్ వాయిదా పడటంతో భారత క్రికెట్ నియంత్రనా మండలి (బీసీసీఐ) ఐపీఎల్ నిర్వహణకు వ్యూహాలను వేగవంతం చేసింది

ఆస్ట్రేలియా వేదిక త్వరలో జరగాల్సిన టీ 20 ప్రపంచకప్ వాయిదా పడటంతో భారత క్రికెట్ నియంత్రనా మండలి (బీసీసీఐ) ఐపీఎల్ నిర్వహణకు వ్యూహాలను వేగవంతం చేసింది.

భారత్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని గతంలోనే నిర్ణయించింది. దీంతో విదేశాల్లో లీగ్ నిర్వహణకు అనుమతిని కోరుతూ ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

Also Read:బీసీసీఐ నోట్లో పాలు పోసిన ఐసీసీ: సెప్టెంబర్ లో ఐపీఎల్ షురూ..!

ప్రస్తుతం మనదేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సెప్టెంబర్- నవంబర్ మధ్యలో లీగ్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించామని బ్రిజేష్ లేఖలో పేర్కొన్నారు.

విదేశీ గడ్డపై మ్యాచ్‌ల నిర్వహణకు భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ సోమవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

పొట్టి వరల్డ్ కప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించాలని తొలి నుంచి భావిస్తున్న బీసీసీఐ దానికి అనుగుణంగానే గత శుక్రవారం నిర్వహించిన వర్చుల్ సమావేశంలో లీగ్ నిర్వహణపై సుధీర్ఘంగా చర్చించింది.

Also Read:కరోనా ఎఫెక్ట్: టీ-20 పురుషుల ప్రపంచకప్ క్రికెట్ పోటీలు వాయిదా

దీనిలో భాగంగా ఒక్క ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతేనే దాదాపు 4 వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం వుందని పెద్దలు అంచనా వేశారు. సరిగ్గా ఇదే సమయంలో ఐసీసీ ప్రకటన అనుకూలంగా రావడంతో బీసీసీఐ నెత్తిపై పాలు పోసినట్లయ్యింది.

కేంద్రం నుంచి అనుమతి రావడమే తరువాయి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కాగా దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014లో తొలిసారి యూఏఈలో ఐపీఎల్‌-7ను నిర్వహించిన విషయం తెలిసిందే. 

click me!