
దోహా వేదికగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) లీగ్ ను గౌతం గంభీర్ సారథ్యంలోని ఇండియా మహారాజాస్ జట్టు ఓటమితో లీగ్ ను ఆరంభించింది. పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది సారథ్యంలోని ఆసియా లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా మహారాజాస్ కు ఓటమి తప్పలేదు. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆసియా లయన్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆ జట్టులో పాక్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ (50 బంతుల్లో 73, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కు తోడుగా శ్రీలంక మాజీ ఆటగాడు ఉపుల్ తరంగ (40) రాణించారు.
దిల్షాన్ (5), అస్గర్ ఆఫ్గాన్ (1), అఫ్రిది (12), తిషారా పెరీరా (5), అబ్దుల్ రజాక్ (6) లు విఫలమయ్యారు. ఇండియా మహారాజాస్ బౌలర్లలో అవానా, స్టువర్ట్ బిన్నీలు తలా రెండు వికెట్లు తీయగా ఇర్ఫాన్ పఠాన్, అశోక్ దిండాలు తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేనదలో ఇండియా మహారాజాస్.. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (0) వికెట్ ను త్వరగానే కోల్పోయింద. కానీ కెప్టెన్ గౌతం గంభీర్ (39 బంతుల్లో 54, 7 ఫోర్లు), మురళీ విజయ్ (25) రెండో వికెట్ కు 50 పరుగులు జోడించారు. విజయ్ ను దిల్షాన్ ఔట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా (3) విఫలమయ్యాడు. మహ్మద్ కైఫ్ (22) ఫర్వాలేదనిపించగా యూసుఫ్ పఠాన్ (14), స్టువర్ట్ బిన్నీ (8) లు నిరాశపరిచారు.
చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (19) ధాటిగా ఆడినా పాకిస్తాన్ మాజీ బౌలర్ సోహైల్ తన్వీర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే గాక మూడు వికెట్లు తీయడంతో ఇండియా మహారాజాస్ కు షాకులు తప్పలేదు. 19వ ఓవర్లో తన్వీర్.. తొలి బంతికి బిన్నీతో పాటు చివరి బంతికి ఇర్ఫాన్ ను ఔట్ చేసి ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు.దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 9 పరుగుల తేడాతో ఆసియా లయన్స్ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో రాణించిన మిస్బా ఉల్ హక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ లీగ్ లో నేడు రాత్రి 8 గంటలకు ఇండియా మహారాజాస్ జట్టు.. వరల్డ్ జెయింట్స్ తో పోటీ పడనుంది.