
ఐపీఎల్-2022 లో విరాట్ కోహ్లి వరుస వైఫల్యాలు అతడి జాతీయ జట్టు స్థానంపై కూడా ప్రభావితం చేస్తున్నాయా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. బీసీసీఐ తో పాటు జాతీయ సెలెక్టర్లు కూడా కోహ్లి ఫామ్ పై ఓ కన్నేసి ఉంచారని, త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగబోయే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో కోహ్లికి చోటు దక్కడం గగనమేనని తెలుస్తున్నది. పలు జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కోహ్లి ఇదే ఫామ్ ను కొనసాగిస్తే అతడికి దక్షిణాఫ్రికా సిరీస్ లో చోటు దక్కడం కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి. స్వయంగా బీసీసీఐ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్ కు విరాట్ కోహ్లి చేసిన సేవలు అనన్య సామాన్యమైనవి. కానీ గత కొద్దికాలంగా అతడి ఫామ్ ఆందోళన పరుస్తున్నది. జాతీయ సెలెక్టర్లతో పాటు బీసీసీఐ కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నది..’ అని చెప్పారు.
మరి కోహ్లి తాజా ప్రదర్శన నేపథ్యంలో రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ లో కోహ్లి ని తుది జట్టులో ఉంచుతారా..? అనే ప్రశ్నకు అదే అధికారి సమాధానమిస్తూ.. ‘మేము సెలెక్షన్ విషయాల్లో జోక్యం చేసుకోబోం. ఈ విషయమ్మీద సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారు. మేము ఆ విషయాల జోలికి వెళ్లబోము. కానీ జరుగుతున్న పరిస్థితులు (కోహ్లి ఫామ్) మాత్రం వాళ్లకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయనేది మాత్రం వాస్తవం..’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇదే విషయమ్మీద జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మెన్ చేతన్ శర్మను వివరణ కోరగా ఆయన.. ‘నేను దీనిమీద మాట్లాడదలుచుకోలేదు..’ అని వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. బీసీసీఐ, జాతీయ సెలెక్టర్ల వ్యాఖ్యలు కోహ్లి కొంప ముంచేలా ఉన్నాయని టీమిండియా అభిమానులు వాపోతున్నారు.
మునుపెన్నడూ లేని విధంగా విరాట్ కోహ్లి ఈ ఐపీఎల్ సీజన్ లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్-15లో కోహ్లి స్కోర్లు.. 41 నాటౌట్, 12, 5, 48, 1, 12, 0, 0, 9 గా ఉన్నాయి. వరుసగా రెండు మ్యాచులలో డకౌట్ అయిన కోహ్లి మంగళవారం రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ తో కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నా 9 పరుగులకే ఔటై మరోసారి నిరాశపరిచాడు.
ఇక ఐపీఎల్-15 ముగిసిన (మే 29) వెంటనే జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్ కోసం ఇప్పటివరకు జట్టును ప్రకటించలేదు. కోహ్లి గనక ఇదే ఫామ్ ను కొనసాగిస్తే బీసీసీఐ, సెలెక్టర్ల ఆందోళనలు నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్ :
- తొలి టీ20 : జూన్ 9 : ఢిల్లీ
- రెండో టీ20 : జూన్ 12 : కటక్
- మూడో టీ20 : జూన్ 14 : వైజాగ్
- నాలుగో టీ20 : జూన్ 17 : రాజ్కోట్
- ఐదో టీ20 : జూన్ 19 : బెంగళూరు