రాజకీయమేమీ లేదు.. అవి ఐసీసీ స్టాండర్డ్స్‌‌కు అనుగుణంగా లేవు : స్టేడియాల ఎంపిక వివాదంపై బీసీసీఐ క్లారిటీ

Published : Jun 28, 2023, 03:51 PM ISTUpdated : Jun 28, 2023, 03:52 PM IST
రాజకీయమేమీ లేదు.. అవి ఐసీసీ స్టాండర్డ్స్‌‌కు అనుగుణంగా లేవు : స్టేడియాల ఎంపిక వివాదంపై బీసీసీఐ క్లారిటీ

సారాంశం

ICC ODI World Cup 2023: భారత్ వేదికగా జరుగబోయే  వన్డే వరల్డ్ కప్‌లో  భాగంగా ఎంపిక చేసిన  స్టేడియాలపై  పలు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ  బీసీసీఐ స్పందించింది. 

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా  ఐసీసీ.. మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ..  లీగ్, నాకౌట్ మ్యాచ్‌లను నిర్వహించేందుకుగాను 10 వేదికలను ఎంపిక చేసింది.  మొత్తంగా 12 వేదికలు ఎంపిక చేయగా ఇందులో రెండింటిలో వార్మప్ మ్యాచ్ (తిరువనంతపురం, గువహతి), పది  వేదికలలో లీగ్, నాకౌట్ మ్యాచ్ లు  జరుగుతాయి.   అయితే   వరల్డ్ కప్ షెడ్యూల్ లో మొహాలి (పంజాబ్) తో పాటు ఇండోర్ (మధ్యప్రదేశ్) లకు చోటు కల్పించకపోవడంపై  తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 

మొహాలిలో వన్డే వరల్డ్ కప్  మ్యాచ్ నిర్వహించకపోవడంపై పంజాబ్ క్రీడల మంత్రి  గుర్మీత్ సింగ్ తప్పుబట్టారు.  రాజకీయ జోక్యం వల్లే బీసీసీఐ.. మొహాలిలో జరిగే మ్యాచ్ లను ఇతర వేదికలను తరలించిందని ఆరోపించారు. బీసీసీఐ సెక్రటరీ జై షా  తన  సొంత రాష్ట్రం  (గుజరాత్)లో ఉన్న అహ్మదాబాద్ స్టేడియానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని   విమర్శలు కూడా వస్తున్నాయి.   

విమర్శల నేపథ్యంలో  బీసీసీఐ  ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.  ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ప్రపంచకప్ కోసం మేం 12 వేదికలను ఎంపిక చేశాం.  గువహతి, తిరువనంతపురంలో వార్మప్ మ్యాచ్ లు జరుగుతాయి.  మిగిలిన చోట్ల లీగ్, నాకౌట్ మ్యాచ్ లు నిర్వహిస్తారు.  ఈ వేదికలలో గతంతో పోల్చితే వసతులు మెరుగయ్యాయి. అందుకే వీటికి అవకాశమిచ్చాం.  మ్యాచ్‌లను కేటాయించడంలో ఏ వేదికపైనా వివక్ష చూపలేదు. మొహాలిలో  వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లను నిర్వహిస్తున్నాం. విరాట్ కోహ్లీ వందో టెస్టు కూడా ఇక్కడే  నిర్వహించాం.. 

మొహాలిలోని మల్లాన్‌పూర్ స్టేడియం  ఇప్పుడిప్పుడే  పునర్మిర్మాణ ప్రక్రియ లో ఉంది.  ఇది ఐసీసీ  ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు. ఉండుంటే ఇక్కడ కూడా మ్యాచ్ లను నిర్వహించేవాళ్లం.  ఐసీసీ టోర్నీ కాబట్టి దాని నిర్ణయమే కీలకం.   మేం ఎవరిమీదా, ఏ   రాష్ట్రం మీదా వివక్ష చూపలేదు..’అని  తెలిపాడు.  

ఇండోర్ (మధ్యప్రదేశ్), మొహాలి (పంజాబ్) లలో  మ్యాచ్ లు లేకపోవడంపై ఆ రాష్ట్రాల క్రికెట్ బోర్డులు బీసీసీఐ పై  నేరుగా విమర్శలు సంధించాయి.   మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్  అధ్యక్షుడు అభిలాష్ ఖండేకర్ మాట్లాడుతూ.. ‘1987లో భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఇండోర్ లో ఆస్ట్రేలియా -  న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్.. ఇక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడింది.  ఘన చరిత్ర ఉన్న ఈ స్టేడియానికి  వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా దక్కకపోవడం బాధాకరం.  ఈ  టోర్నీలో మేం కనీసం రెండు, మూడు మ్యాచ్ లు అయినా  దక్కుతాయని ఆశించాం. కానీ మాకు నిరాశే మిగిలింది..’అని  తెలిపాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. ‘వరల్డ్ కప్ షెడ్యూల్ ను చూస్తుంటే కేవలం మెట్రో నగరాలు, బీసీసీఐ బోర్డులో ఉన్న ఆఫీస్ బేరర్లు ప్రాతినిథ్యం వహించే నగరాలకు మాత్రమే వేదికలు దక్కాయి.  మేం మొహాలీలో  వరల్డ్ కప్ మ్యాచ్ లు ఉంటాయని భావించాం.  కానీ ఒక్క మ్యాచ్ కూడా మాకు దక్కలేదు. కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కు కూడా మేం నోచుకోలేదు..’అని  చెప్పాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !