
గత నెల 29న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్-2022 ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా. రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తో నెహ్రా క్లోజ్ గా ఉంటాడు. నెహ్రా ఆర్సీబీ కోచింగ్ టీమ్ లో ఉన్నప్పుడు చాహల్ తో క్లోజ్ గా ఉండేవాడు. తాజాగా ఓ పార్టీలో కలిసిన ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పార్టీ అయిన తర్వాత యుజీని నెహ్రా.. ‘అరేమ్ బస్ లో వెళ్దాం రా..’ అంటే దానికి చాహల్.. ‘అన్నా నేను కార్లో వెళ్తా..’అని రిప్లై ఇవ్వడం తర్వాత ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ ఫైనల్ అనంతరం ఈ రెండు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు ముంబైలో జరిగిన ఓ పార్టీకి హాజరయ్యారు. అయితే పార్టీ ముగిసిన తర్వాత యుజీ.. తన కార్ లో వెళ్లబోతుంటే అప్పుడే అక్కడికి నెహ్రా వచ్చాడు.
చాహల్ వద్దకు వచ్చిన నెహ్రా.. ‘అరేయ్.. కార్ వద్దు.. బస్ లో వెళ్దాం రా’ అని అతడి చేయి పట్టుకుని బస్ వైపునకు తీసుకెళ్లాడు. కానీ చాహల్.. ‘అన్నా నేను కార్ లో వస్తా. నా వైఫ్ కూడా ఉంది. తనను వదిలి ఎలా రావాలి..’ అని బదులిచ్చాడు. దానికి నెహ్రా స్పందిస్తూ.. ‘అవునా.. నీ భార్య కూడా మనతో పాటే బస్ లో వస్తుంది పదా..’ అంటూ కార్ ఎక్కబోతున్న ధనశ్రీ వర్మను కూడా బస్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. అయితే ఈ ఇద్దరి మాటలు, ప్రవర్తన చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘తాగి మాట్లాడుతున్నారా..?’ ‘రోడ్ మీద ఆ రచ్చ ఏంటి..?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్-15లో చాహల్.. 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీసి సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ సీజన్ లో ఓ హ్యాట్రిక్ తో పాటు ఒక మ్యాచ్ లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన చాహల్ కే పర్పుల్ క్యాప్ దక్కింది.