వ్యక్తిగతంగా తాను అద్భుతమైన ప్రదర్శన కనపరుస్తూనే... తన జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచేలా చేశాడు.
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు ఓ సంచలనం. ఐపీఎల్ లో కొత్త టీమ్ తో.. తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఏ మాత్రం తడపడకుండా.. ఏకంగా విజయం సాధించాడు. వ్యక్తిగతంగా తాను అద్భుతమైన ప్రదర్శన కనపరుస్తూనే... తన జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచేలా చేశాడు.
ఈ క్రమంలో... అందరూ హార్దిక్ పాండ్యా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా... ఐపీఎల్ సమరం ముగియడంతో.. దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 మ్యాచ్ కోసం తలపడనున్నాడు. గురువారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. పాండ్యా.. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.
‘నేను భారత జట్టులో చేరినప్పుడు నేను ఏ ఆటగాళ్లను చూసి పెరిగానో వారే ఉన్నారు. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రాలు నేను ఇండియాకు ఆడకముందే స్టార్ ఆటగాళ్లు. నేను వారితో ఆడటం గొప్పగా ఫీలయ్యాను. ఇంటర్నేషన్ క్రికెట్లో ఆడిన మూడో మ్యాచ్లకే ధోనీ నన్ను ప్రపంచకప్ జట్టులోకి తీసుకున్నాడు. నువ్వు వరల్డ్ కప్ టీమ్లో ఆడుతున్నావని ధోనీ నాకు ముందే చెప్పాడు. ఆ క్షణం నా కల నెరవేరినట్లు అనిపించింది'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
కాగా.. ధోనీ కారణంగానే తాను ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. 'నా అరంగేట్ర మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాను. ఎంతలా అంటే నేను వేసిన తొలి ఓవర్లోనే 21 పరుగులు సమర్పించుకున్నాను. నాకు తెలిసి ఇలా కెరీర్ తొలి ఓవర్లోనే ఇన్ని పరుగులిచ్చుకున్న తొలి క్రికెటర్ నేనే అనుకుంట. ఆ క్షణం ఇదే నా చివరి ఓవర్ కావచ్చనుకున్నా. కానీ నేను చాలా అదృష్టవంతుడిని. ధోనీ సారథ్యంలో ఆ ఓవర్ వేసాను కాబట్టి అతను నన్ను పక్కనపెట్టకుండా అండగా నిలిచాడు. నాపై అపార నమ్మకం ఉంచాడు. కెరీర్లో నా సక్సెస్కు సహకరించాడు.’ అంటూ హార్దిక్ తెలిపాడు.