ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చలు చేసే అవకాశం లేకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో వరుసగా రెండో సమీక్షలోనూ కీలక వడ్డీరేట్లలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఎటువంటి మార్పు చేయకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉల్లి, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో డిసెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠానికి చేరి 7.35 శాతంగా నమోదైంది.
Also read:టోకు ధరల సూచీలో కూర‘గాయాలే’.. 8 నెలల గరిష్ఠానికి డబ్ల్యూపీఐ
జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది శాతాన్ని దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలు ఆర్బీఐ వడ్డీరేట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. సాధారణంగా ద్రవ్యోల్బణ గణాంకాలను ఆధారంగా తీసుకుని వడ్డీరేట్లలో మార్పులు చేస్తుంటారు.
Also read:ఆర్కామ్ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్టెల్ కూడా
ఈసారి రిటైల్ ద్రవ్యోల్బణ స్థాయి గణనీయంగా ఉండటం కారణంగా ఫిబ్రవరిలో జరిగే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచే అవకాశాలున్నాయని ఎస్బీఐ అధ్యయన నివేదిక పేర్కొంది.
ఉల్లిగడ్డల ధరల విషయంలో గత డిసెంబర్ నెలలో జరిగిన సమీక్షలోనూ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన విషయం విదితమే. 2020 సంవత్సరం మొత్తంలోనూ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు కన్పించట్లేదని ఈ నివేదిక పేర్కొంది.
ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంతదాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ నెలల మధ్య వరుసగా రేట్ల తగ్గింపు చేపట్టారు. ఈ కాలంలో మొత్తం ఐదు సార్లు 135 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీరేట్లను తగ్గించారు.
అయితే మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో 2019 డిసెంబర్ నెలలో జరిగిన సమీక్షలో కీలక వడ్డీరేటును 5.15 శాతం వద్ద యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. వచ్చే నెలలో తదుపరి సమీక్ష జరగనుంది. ఫిబ్రవరి 6న ఆర్బీఐ సమీక్ష నిర్ణయాలను ప్రకటిస్తారు. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత జరగబోయే సమీక్ష కావడం వల్ల దీనిపై ఆసక్తి నెలకొంది.